2022లో సిద్దిపేటకు రైలు బండి
సిద్ధిపేట రైల్వే మార్గం ద్వారా రాజధాని హైదరాబాద్తో అనుసంధానం కాబోతోంది. కొత్తగా చేపట్టిన మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో రెండో దశ పనులు పూర్తయి 2022 మార్చిలో సిద్దిపేట...
2022 మార్చిన తెలంగాణలో ఓ కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఎంతో కాలంగా సిద్ధిపేట ప్రజలు ఎదిరి చూస్తున్న రైలు బండి కూత వినబడనుంది. సిద్ధిపేట రైల్వే మార్గం ద్వారా రాజధాని హైదరాబాద్తో అనుసంధానం కాబోతోంది. కొత్తగా చేపట్టిన మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో రెండో దశ పనులు పూర్తయి 2022 మార్చిలో సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు అన్ని అడ్డంకులు అధిగమించి పనులు ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ సుంచి 31 కి.మీ. దూరంలోని గజ్వేల్ వరకు పనులు పూర్తయ్యాయి. ఇక్కడి వరకు రైలు నడుపుకోవటానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జూన్ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీలు పూర్తి చేసి రైలు సర్వీసులకు అనుమతి మంజూరు చేశారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల మేరకు కొన్ని నిర్ధారిత మినహా సాధారణ రైళ్ల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో రైలు సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నిబంధనలు సడలించగానే గజ్వేల్ వరకు రైలు సేవలు మొదలుకానున్నాయి. గజ్వేల్ వరకు పనులు పూర్తి కావడంతో ప్రాజెక్టు రెండో దశలో భాగంగా సిద్దిపేట వరకు పనులు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు సాగుతోంది.
ఇప్పటికే సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు ఎర్త్వర్క్ను దాదాపు పూర్తి చేసింది. అదే సమయంలో వంతెనల పనులు కూడా జరుపుతోంది. ఇవి వేగంగా సాగుతున్నాయి. కరోనా వల్ల కూలీల కొరత, రైల్వే శాఖ ఆదాయం పడిపోవడంతో పనుల్లో కొంత జాప్యం తప్పలేదు. త్వరలో వాటిని అధిగమించి వేగంగా పనులు పూర్తి చేయనున్నట్టు రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు.