అటల్ బిహారీ జయంతి: ముందుచూపుతో కూడిన వాజ్పేయి నాయకత్వం దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేసిందన్న మోదీ
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు..
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు వాజ్ పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలో రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన ‘సదైవ్ అటల్’ను వారు ఈ ఉదయం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ముందుచూపుతో కూడిన వాజ్పేయి నాయకత్వం దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేసిందన్నారు. బలమైన, సుసంపన్నమైన భారత్ను నిర్మించడానికి వాజ్ పేయి చేసిన ప్రయత్నాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మోదీ కోరారు. వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 25ను ‘సుపరిపాలన దినోత్సవం’ గా బీజేపీ సర్కారు జరుపుతోన్న సంగతి తెలిసిందే. ఇదే రోజు సంఘసంస్కర్త మదన్ మోహన్ మాలవీయ జయంతి కూడా. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు. తన జీవితాన్ని సాంఘిక సంస్కరణలకే మాలవీయ అంకితం చేశారని చెప్పారు.