కేబుల్ బ్రిడ్జిపై తిక్క వేశాలు.. ఆట కట్టించిన పోలీసులు
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వంతెనపైకి వెళ్లడానికి అర్ధరాత్రి 11:00 తర్వాత అనుమతి లేదంటూ అధికారులు ఇటీవలూ ఆదేశాలు జారీ చేశారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వంతెనపైకి వెళ్లడానికి అర్ధరాత్రి 11:00 తర్వాత అనుమతి లేదంటూ అధికారులు ఇటీవలూ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆకతాయిలు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కేబుల్ బ్రిడ్జిపై ఓవరాక్షన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి వంతెనపై బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం, బ్రిడ్జిపై పడుకొని ఫొటోలు దిగడం చేస్తున్నారు. ఇటీవల బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతున్నాయి. బ్రిడ్జ్పై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సైబరాబాద్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్కు లింక్ చేశారు. బుధవారం అర్ధరాత్రి బ్రిడ్జిపైకి చేరి షర్ట్ లేకుండా రోడ్డుపై పడుకొని ఫొటోలకు పోజులిస్తున్న పోకిరీలను కంట్రోల్ రూమ్ సిబ్బంది గుర్తించి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ సిబ్బంది బ్రిడ్జిపైకి చేరుకొని వారిని అదుపులోకి తీసుకుని, మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై రాత్రి సమయంలో అల్లరి పనులు చేస్తున్న యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. pic.twitter.com/dqMWMenpTe
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) October 8, 2020
దుర్గం చెరువు వంతెనపై సందర్శకులు ఈ నిబంధనలు పాటించాల్సిందే : పోలీసులు
- రోజూ రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 వరకు కేబుల్ బ్రిడ్జిని మూసివేత
- వాహనాలు మాత్రమే కాదు.. ప్రజలు కూడా రాత్రి 11 తర్వాత వంతెనపైకి వెళ్లడానికి వీల్లేదు
- వంతెనపై ఉన్న డివైడర్లను దాటడం, వంతెన చివర ఉన్న అంచులపై ఎక్కి కూర్చోవడం నేరంగా పరిగణించబడుతుంది.
- పుట్టినరోజు, ఇతరత్రా కార్యక్రమాల పేరుతో వంతెనపై గుమిగూడటం, మద్యం తాగడం నిషేధం
- వారాంతంలో శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 వరకు వంతెనపై వాహనాల రాకపోకలకు అనుమతి లేదు.
- వాహనదారులకు బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం
- వారాంతాల్లో మాదాపూర్, రోడ్ నంబర్-45 రోడ్లు మూసివేత.
- సాధారణ రోజుల్లో వంతెనపై వాహనాల వేగం గంటకు 35 కిలోమీటర్లు మించకూదు
Also Read : ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ