భారత్లో తొలి ఆవిష్కరణ..ఢిలీలో లోకో పైలట్ రహిత మెట్రో ట్రైయిన్..ఇవాళ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
డ్రైవర్ లేకుండా రైలు నడిపే సాంకేతిక ప్రక్రియను సంతరించుకోవడం మెట్రో రైలు వ్యవస్థలో కీలక పరిణామం అయింది. రైలు పట్టాలపై లోపాలు, అడ్డంకులు ఉంటే గుర్తించేందుకు అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఏర్పాటు చేశారు.
PM Narendra Modi will flag off : భారతదేశపు తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా దేశ రాజధానిలో ప్రయోగాత్మకంగా పట్టాలెక్కిస్తున్నారు. ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ గార్డెన్లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. జనక్పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకూ 37 కిలోమీటర్ల మేర మాగ్నెటా లైన్లో ఈ రైలు ప్రయాణం సాగుతుంది. దీనితోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తారు.
డ్రైవర్ లేకుండా..
ఈ వినూత్న రైలు సర్వీసు కోసం ఢిల్లీ మెట్రోరైలు విభాగం నిర్వహిస్తుంది. డ్రైవర్ లేకుండా రైలు నడిపే సాంకేతిక ప్రక్రియను సంతరించుకోవడం మెట్రో రైలు వ్యవస్థలో కీలక పరిణామం అయింది. రైలు పట్టాలపై లోపాలు, అడ్డంకులు ఉంటే గుర్తించేందుకు అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ఆధారంగా ట్రైయిన్ ప్రయాణంను పర్యవేక్షించనున్నారు.
ఈ ఆవిష్కరణలు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్లెస్ మెట్రో రైల్ నెట్వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుందన్నారు. సోమవారం మెజెంటా లైన్లో డ్రైవర్లెస్ సర్వీసులు ప్రారంభమైన తరువాత, 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్లో డ్రైవర్లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.