India Digital Toy Fair 2021: నేటినుంచి కనువిందు చేయనున్న.. ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Digital Toy Fair 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాయ్ ఫేర్-2021ను ఈ రోజు ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న ఇండియా టాయ్ ఫేర్-2021 కార్యక్రమాన్ని..
Digital Toy Fair 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాయ్ ఫేర్-2021ను ఈ రోజు ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న ఇండియా టాయ్ ఫేర్-2021 కార్యక్రమాన్ని శనివారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. బొమ్మల పరిశ్రమ సమగ్రాభివృద్ధి దిశగా వర్తకులు, వినియోగదారులు, ఉపాధ్యాయులు, డిజైనర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ డిజిటల్ టాయ్ ఫేర్ను నిర్వహిస్తున్నట్లు ప్రధాని మంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. టాయ్ ఇండియా ఫేర్ శనివారం నుంచి మార్చి 2వ తేదీ వరకు సాగనుంది. బొమ్మలు పిల్లల మానసిక అభివృద్ధిలో ముఖ్యమైన ప్రాతను పోషిస్తాయని, సైకోమోటార్ అభిజ్ఞా నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతాయని వెల్లడించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్ను భారతదేశ బొమ్మల పరిశ్రమలను అభివృద్ధి చేయడంకోసం.. వ్యాపారసంబంధాలను అనుసంధానం చేయడం కోసం నిర్వహిస్తున్నారు. ఈ ఫేయిర్లో కేవలం భారతీయ బొమ్మలనే ప్రదర్శించనున్నారు.
వర్చువల్ విధానంలో జరిగే ఈ ప్రదర్శనలో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ఈ-కామర్స్ ఎనేబుల్డ్ వర్చువల్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. ఇందులో సాంప్రదాయ భారతీయ బొమ్మలతో పాటు ఎలక్ట్రానిక్ బొమ్మలు, ఖరీదైన బొమ్మలు, పజిల్స్, ఆటలతో సహా ఆధునిక బొమ్మలు ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా బొమ్మల తయారీ రంగంపై ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ వక్తలతో వెబ్నార్లు, ప్యానెల్ చర్చలు కూడా నిర్వహించనున్నారు. దీనిలో పాల్గొనాలనుకున్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
గతేడాది ఆగస్ట్లో నిర్వహించిన మన్కీ బాత్ కార్యక్రమంలో భారత్లో బొమ్మల తయారీపై ప్రసంగించారు. ప్రపంచ బొమ్మల పరిశ్రమలో భారతదేశానికి చాలా తక్కువ వాటా ఉందని.. దీనివల్ల భారత వ్యాపారులు ఈ రంగంలో దృష్టిసారించాలని పేర్కొన్నారు. ఎంతో గొప్ప సంస్కృతి, వారసత్వం, నైపుణ్యం, ప్రతిభావంతులైన చేతివృత్తులవారు ఉన్నారని.. వారంతా బొమ్మల తయారీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా.. దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ బొమ్మల్లో 30 శాతం ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఇవి పిల్లలకు సురక్షితం కాదని ప్రభుత్వ కమిటీ కూడా సూచించింది.
Also Read: