కరోనాని ఎన్క్యాష్ చేసుకున్నాడు: తెలుగురాష్ట్రాల్లో సామాజిక సేవంటూ పాస్టర్ మహామాయ, కోట్ల సొమ్ముతో పరార్
తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ ముసుగులో ఓ కేటుగాడు ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. బ్యాంక్ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్లు మూటగట్టుకుని..
తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ ముసుగులో ఓ కేటుగాడు ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. బ్యాంక్ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్లు మూటగట్టుకుని బిచాణ ఎత్తేశాడు. పలు ప్రాంతాల్లో ఈ మోసగాడు ప్రజాసేవ ముసుగులో లక్షలు గడిస్తూ ప్రజల్ని బురిడీ కొట్టించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ ప్రాంతానికి చెందిన జాన్ – పాస్టర్గా పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ ని ఎన్ క్యాష్ చేసుకుని లాక్డౌన్ టైమ్లో సామాజిక సేవా కార్యక్రమాలతో వెలుగులోకి వచ్చాడు. కరోనాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య సిబ్బందికి సాయం చేసేవాడు. అంతేనా… తాను చేసే సేవా కార్యక్రమాలకు పోలీసు ఉన్నతాధికారులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా సహాయం అందజేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఇమేజ్ని అడ్డు పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని, పోలీస్ కేసుల్లో పేరు లేకుండా చేస్తానని మాయ మాటలు చెప్పి చాలా మంది అమాయకులను నమ్మించాడు. ఉన్నతాధికారులతో దిగిన ఫోటోలు తరచుగా వాట్సప్లో పోస్ట్ చేయడంతో అమాయకులు పాస్టర్ జాన్ మాయలో పడిపోయారు. పలువురికి PMRY రుణాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు వసూలు చేసాడు.
ఇలా, దాదాపు 60 నుంచి 80 మంది వద్ద… దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, రుణాలు అందక పోవడంతో మోసపోయామని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పాస్టర్ జాన్ను నిలదీశారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని కొందరికి చెక్కులు , అగ్రిమెంట్లు రాసిచ్చి కాలయాపన చేశాడు. బాధితుల ఒత్తిడి పెరగడంతో చివరకు పాస్టర్ జాన్ జెండా ఎత్తేశాడు. మోసగాడు పాస్టర్ జాన్పై చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ కేటుగాడిపై తెలుగు రాష్ట్రాల్లో పలు చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.