మరో యువకుడి ప్రాణాలు బలిగొన్న లోన్ యాప్లు.. ఆత్మహత్యకు ముందు స్నేహితుడికి సెల్ఫీ వీడియో.
ఇటీవల లోన్ యాప్ యాజమాన్యలు పెడుతోన్న టార్చర్ భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...
one more person died due to loan apps: ఎలాంటి పుచికత్తు లేకుండా కేవలం కొద్ది క్షణాల్లోనే రుణాలు ఇస్తూ ఆకట్టుకుంటున్న లోన్ యాప్ల నిజం స్వరూపం ఇటీవలి కాలంలో బయటపడుతోంది. అడక్కుండానే అప్పులిచ్చి చట్టాలకు విరుద్ధంగా వడ్డీలు వసూలు చేస్తూ.. సమయానికి వడ్డీ చెల్లించక పోతే మెంటల్ టార్చర్ పెడుతున్నాయి లోన్ యాప్స్. ఇటీవల ఈ యాప్ యాజమాన్యలు పెడుతోన్న టార్చర్ భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ కుమార్ అనే వ్యక్తి పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎస్ఎల్. ట్రాన్స్ కంపెనీలో సైట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. సంతోష్ కుమార్ ఆన్లైన్లో పలు యాప్ల ద్వారా మొత్తం రూ.50 వేలకు పైగా అప్పు తీసుకున్నాడు. ఇటీవల యాప్ నిర్వాహకులు వడ్డీ, అసలు చెల్లించాలని ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులు మొదలు పెట్టారు. దీంతో భరించలేక ఈ నెల 18న కిరాయికి ఉంటోన్న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితుడికి పంపించాడు. దీంతో విషయం తెలుసుకున్న సంతోష్ స్నేహితుడు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించాడు. అయితే సంతోష్ బంధువులు మెరుగైన వైద్యం కోసం డిసెంబర్ 21న స్వస్థలం విశాఖపట్నం తీసుకెళ్లారు. ఆరోగ్యం విషమించడంతో సంతోష్ కుమార్ ఆసుపత్రిలోనే ఈనెల 23న మరణించాడు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో లోన్ యాప్ల దాష్టికం మరోసారి అందరికీ తెలిసొచ్చింది. తన మిత్రుడు సంతోష్ కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించిన యాప్ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు గురువారం ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.