పర్యావరణవేత్త గ్రేటా థన్బర్గ్కు నోబెల్ శాంతి బహుమతి?
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ పురస్కారం పొందే ఆస్కారం ఉందా? అంత దృశ్యం లేదంటున్నారు విశ్లేషకులు..
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ పురస్కారం పొందే ఆస్కారం ఉందా? అంత దృశ్యం లేదంటున్నారు విశ్లేషకులు.. ఆ బహుమతి అంటూ ఇస్తే గిస్తే పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే స్వీడన్ బాలిక గ్రేటా థన్బర్గ్కు ఇవ్వాలని చెబుతున్నారు.. ఆమె అన్ని విధాలా నోబెల్ శాంతి బహుమతికి అర్హురాలంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రచారం నిర్వహించిన ఆ బాలిక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.. నార్వే రాజధాని ఓస్లోలో వచ్చె నెల తొమ్మిదిన శాంతి బహుమతి ఎవరికి ఇవ్వాలన్నది డిసైడవుతుంది.. పురస్కారంతో పాటు పది లక్షల డాలర్లు అంటే ఇంచుమించు 90 లక్షల స్వీడిష్ క్రోనార్లు నగదు ఇస్తారు..డబ్బుదేముంది కానీ, ఆ బహుమతి అందుకుంటే చాలు అదే పది కోట్లు..! ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతి కోసం 318 మంది పోటీపడుతున్నారు.. అయితే 17 ఏళ్ల స్వీడిష్ బాలికకే ఎక్కువ ఛాన్సుంది.. నార్వేకు చెందిన ముగ్గురు న్యాయ నిపుణులు, స్వీడన్కు చెందిన ఇద్దరు పార్లమెంటేరియన్లు థన్బర్గ్ను నామినేట్ చేశారు. ఒకవేళ థన్బర్గ్ శాంతి బహుమతి గెల్చుకుంటే పిన్న వయసులో ఆ ప్రతిష్టాకరమైన అవార్డును గెల్చుకున్న పాకిస్తాన్కు చెందిన మలాలా యూసుఫ్జాయ్ రికార్డును సమం చేస్తుంది.. ఎందుకంటే ఆ అవార్డును గెల్చుకున్నప్పుడు మలాలా వయసు కూడా 17 ఏళ్లే! ప్రముఖ చరిత్రకారుడు, అనేక గ్రంథాల రచయిత ఆస్లే స్వీన్ కూడా థన్బర్గ్వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది శాంతి బహుమతికి థన్బర్గ్ ఒక్కరే అర్హులని గట్టిగా చెబుతున్నారు. పర్యావరణం కోసం ఆ బాలిక ఎంతగా పోరాడుతున్నదో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.. పర్యావరణవేత్తలకు శాంతి బహుమతి ఇవ్వడం ఇదేం కొత్త కాదు.. ఇంతకు ముందు కెన్యాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యావరణవేత్త, గ్రీన్ బెల్ట్ ఉద్యమకారిణి, రాజకీయవేత్త, పరిశోధకురాలు వంగారి మట్టా మథాయ్ 2004లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే 2007లో అమెరికాకు చెందిన పర్యావరణ వేత్త, రాజకీయ నాయకుడు అల్ గోరెకు ఈ పురస్కారం దక్కింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ శాంతి, భద్రత వంటి విషయాలకు నోబెల్ కమిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నది. నిజంగానే ఇప్పుడున్న పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణే ముఖ్యం.. పర్యావరణం బాగుంటే సమస్త జీవరాశులు బాగుంటాయి.. రోగ కారకాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రచారం నిర్వహించిన గ్రేటా థన్బర్గ్ మొన్నీమధ్యనే మళ్లీ స్కూల్ బాట పట్టింది. కరోనా కారణంగా ఆమె ప్రచారానికి బ్రేక్ పడింది. మళ్లీ టీనేజ్ చదువులకు వెళ్లడం సంతోషంగా ఉన్నట్లు కూడా ఆ అమ్మాయి ట్వీట్ కూడా చేసింది. లాస్టియర్ న్యూయార్క్లో జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీలో గ్రేటా థన్బర్గ్ ప్రసంగం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే! హౌ డేర్ యూ అంటూ వాతావరణ సమావేశంలో మాట్లాడిన ఆ బాలిక గ్లోబల్ వార్మింగ్ అంశంపై ప్రపంచ దేశాధినేతలను నిలదీసింది. లాస్టియర్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నది థన్బర్గ్.