అవసరం లేకపోయినా.. అదే అస్త్రం
స్వాత్రంత్యం వచ్చాక డెబ్బై ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దేశానికి స్వాతంత్య్రం రాగానే బ్రిటీష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ.. ఆ రోజుల్లో దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు దేశ విభజన జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నెహ్రూ ప్రభుత్వం జమ్ముకశ్మీర్కు ప్రత్యక హోదా వంటివి కల్పించారు. అప్పటి పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370తో ప్రత్యేక హక్కులను నెహ్రూ ప్రభుత్వం కల్పించింది. […]
స్వాత్రంత్యం వచ్చాక డెబ్బై ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దేశానికి స్వాతంత్య్రం రాగానే బ్రిటీష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ.. ఆ రోజుల్లో దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు దేశ విభజన జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నెహ్రూ ప్రభుత్వం జమ్ముకశ్మీర్కు ప్రత్యక హోదా వంటివి కల్పించారు. అప్పటి పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370తో ప్రత్యేక హక్కులను నెహ్రూ ప్రభుత్వం కల్పించింది.
అయితే ఈ ఆర్టికల్ 370తో రాష్ట్రంలో డెబ్బై ఏళ్లలో ఎలాంటి మార్పు లేదు. పైగా నిత్యం ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండో టర్మ్లో ప్రధాని మోదీ.. కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఆర్టికల్ 370 రద్దు. రెండో సారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా గడవక ముందే.. ఆగస్ట్ 5న పార్లమెంట్లో బిల్లుపెట్టి.. చకచకా జమ్ముకశ్మీర్కు ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్తో పాటు.. మరికొన్ని దేశాలు పెద్ద విషయంగా ప్రపంచ దేశాలకు తెలిసేలా పబ్లిసీటి చేశాయి.
అయితే జమ్ముకశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తితో ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనకపోగా.. నిత్యం కల్లోలంగా మారడంతో.. దేశ ప్రజలకు కూడా కశ్మీర్ విషయంలో ప్రభుత్వం ఎదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటదన్న అభిప్రాయం మోజార్టీ ప్రజల్లో ఏర్పడింది. అందుకే ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 రద్దు విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచింది. అయితే ఇది జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. ఇప్పుడు దేశంలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో.. మోదీ చరిష్మానా.. లేక జాతీయ వాదమా అనే చర్చకు మళ్లీ మొదలైంది.
అయితే ఈ ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు ఆర్టికల్ 370 అంశాన్ని రేకెత్తించడం అనేది హాట్ టాపిక్గా మారింది. దీనిని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకోవడంతో.. బీజేపీ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం మేం చేసిన నిర్ణయాలు దేశ భద్రతకు సంబంధించినవంటూ సమర్థించుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనేది కూడా ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు చిత్రీకరిస్తున్నాయి.
కాగా, 1971లో అప్పటి ఇందిర ప్రభుత్వం బంగ్లాదేశ్పై జరిగిన యుద్ధంలో విజయం సాధించింది. ఆ తర్వాత 1972లో వెంటనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లంది. ఆ ఎన్నికల ప్రచారంలో ఇందిర గాంధీ బంగ్లాదేశ్పై జరిగిన యుద్ధం అంశాన్ని లేవనెత్తి.. అఖండ విజయాన్ని సాధించారు. దేశానికి ఎంతో చేశామని ప్రజలకు తెలియజేస్తూ.. బంగ్లాపై సాధించిన విజయాన్ని ప్రచారాస్త్రంగా వాడుకున్నారు.
ప్రభుత్వాలు ఇలా ప్రచారం చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో తప్పిదం జరిగితే ఇదే అంశాన్ని విపక్షాలు లేవనెత్తి ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో వారు తీసుకున్న నిర్ణయాలను ప్రచారంలో చెప్పడం తప్పలేదు. అయితే ప్రస్తుతం బీజేపీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని లేవనెత్తుతోంది. ప్రచార సభల్లో మోదీ, షాలు ఇరువురు కూడా ఆర్టికల్ 370 రద్దు అంశాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీకి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇరు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సానుకూల పవనాలే ఉన్నాయి. మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గరయ్యాయి. అంతేకాదు.. ఇటీవల బీసీలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి నిర్ణయాలతో అక్కడ బీసీ వర్గాలు బీజేపీకి మొగ్గుచూపుతున్నాయి. అదే సమయంలో ఎన్సీపీ, కాంగ్రెస్లు అంతర్గత కుమ్ములాటలు కూడా బీజేపీకి అనుకూలించే అవకాశం ఉంది. ఇక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై కూడా ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. దీంతో ఇరు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయమన్న విషయం తేటతెల్లమవుతోంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 రద్దు అంశం లేవనెత్తాల్సిన అవసరమే లేదు.