ఉరి సరే.. తీసేవాడెవరు? వేసే చోటేది?
రేపిస్టులకు, ఆడవాళ్ళపై దాడలకు తెగబడే మృగాళ్ళను వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్లు తరచూ వింటూ వున్నాం. దిశ ఉదంతం తర్వాత పలువురు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కానీ, బహిరంగంగా కాదు కదా.. కనీసం జైళ్ళలోను నేరస్థులను ఉరి తీసే పరిస్థితి ఇప్పుడు దేశంలో లేదు. ఎందుకంటారా ? వివరాలు తెలుసుకుంటే ఇదా ఇప్పటి పరిస్థితి అని ఆశ్చర్యపోతారు. ఉరి తీసే చోటేది ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రాజమండ్రి.. ఇటు ముషీరాబాద్ […]
రేపిస్టులకు, ఆడవాళ్ళపై దాడలకు తెగబడే మృగాళ్ళను వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్లు తరచూ వింటూ వున్నాం. దిశ ఉదంతం తర్వాత పలువురు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కానీ, బహిరంగంగా కాదు కదా.. కనీసం జైళ్ళలోను నేరస్థులను ఉరి తీసే పరిస్థితి ఇప్పుడు దేశంలో లేదు. ఎందుకంటారా ? వివరాలు తెలుసుకుంటే ఇదా ఇప్పటి పరిస్థితి అని ఆశ్చర్యపోతారు.
ఉరి తీసే చోటేది ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రాజమండ్రి.. ఇటు ముషీరాబాద్ జైళ్ళలోనే నేరస్థులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు వుండేవి. అనంతరం ముషీరాబాద్ జైలును కూల్చివేశారు. అక్కడ ఇప్పుడు గాంధీ ఆసుపత్రి నిర్మణమైంది. ముషీరాబాద్ జైలును చర్లపల్లికి తరలించారు. అయితే చర్లపల్లిలో ఉరికంభాన్ని నిర్మించలేదు. అక్కడే కాదు.. అటు చంచల్ గూడ, వరంగల్, నిజామాబాద్లలోను కారాగారాలున్నా.. ఉరి కంభాలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో వున్న జైళ్ళలో ఉన్న ఏడుగురు నేరస్థులకు ఉరిశిక్ష ఖరారైంది. వీరిపి ఉరి తీయాలంటే ఉరి కంబం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు ఏ నిర్ణయం లేదు.
ప్రస్తుతం తెలంగాణలో చర్లపల్లి, చంచల్గూడ, వరంగల్ జైళ్లు కేంద్ర కారాగారాలుగా ఉన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉరికంభంతోపాటు ఉరి శిక్ష అమలు పరచడానికి అవసరమైన ఏర్పాట్లు ఒక్క రాజమండ్రి జైలులోనే వున్నాయి. ముషీరాబాద్ జైలులో చివరిసారిగా 1978లో ఓ ఖైదీని ఉరి తీశారు. అంతకు ముందు 1976లో కిష్టప్ప అనే నేరస్థున్ని రాజమండ్రిలో ఉరి తీసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఆ తర్వాత కూడా పలువురికి ఉరి శిక్ష ఖరారైనా వారిని ఉరి తీయలేదు. ప్రస్తుతం గోకుల్చాట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లలో ముద్దాయిలుగా మొత్తం ఏడుగురికి ఉరిశిక్ష వేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు ఉరికంబం విషయం చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో దారుణంగా అత్యాచారాలు చేసి, యువతులను హతమారుస్తున్న ఉదంతాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. వరంగల్లో 9 నెలల పసికందును రేప్ చేసిన ఉదంతం ఒకవైపు.. హాజీపూర్లో పలువురు బాలికలను కిడ్నాప్, అత్యాచారం, హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి ఉదంతం.. తాజాగా దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నలుగురి సంఘటనలు ఉరి శిక్ష అమలు అంశాన్ని తెరమీదికి తెచ్చాయి.
దిల్సుఖ్నగర్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్ల కేసుల్లో ఏడుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్.ఐ.ఏ. ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మొదట దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు 2016 డిసెంబర్ 19వ తేదీన కోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా లుంబినీ పార్కు, గోకుల్ చాట్ పేలుళ్లకు పాల్పడిన అనీక్, అక్బర్లకు అక్టోబర్ 10న ఉరిశిక్ష విధించారు. ఇంకో 3 దశలు దాటితే వీరి ఉరి శిక్ష అమలు అవుతుంది. తొలిదశలో స్పెషన్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ ఉగ్రవాదులు హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు ఖరారు చేస్తే.. దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా వారికి ప్రతీకూలంగా తీర్పు వస్తే.. చివరి అవకాశంగా వారు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చు. రాష్ట్రపతి సైతం క్షమాభిక్షను తోసిపుచ్చితే… దోషులకు విధించిన ఉరి శిక్ష ఖరారవుతుంది.
ఇంతవరకూ బాగానే వుంది కానీ… దోషులకు విధించిన శిక్షలను ఎక్కడ అమలు చేస్తారనేదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే… తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ జైలులోనూ ఉరికంబాల్లేవు. అలాగే ఉరి తీసే తలారులు కూడా లేరు. చాలా యేళ్లుగా తలారుల పోస్టులను జైళ్ళ శాఖ భర్తీ చేయడం లేదు. సో.. ఉరి శిక్ష విధించే విషయంలో ప్రజల్లో ఎలాంటి డిమాండ్లు వినిపిస్తున్నా.. సరైన ఏర్పాట్లు చేయనిదే.. ఎవరికీ ఉరి శిక్ష విధించే అవకాశం లేదు.