ఇక త్వరలో రాష్ట్రంలో తొలి దశ వ్యాక్సినేషన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన, అఖిలేష్ పై ఆగ్రహం
రాష్ట్రంలో తొలిదశ వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభమవుతుందని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 ఏళ్ళు పైబడిన వారికీ ఈ దశలో..
Covid Vaccine:రాష్ట్రంలో తొలిదశ వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభమవుతుందని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 ఏళ్ళు పైబడిన వారికీ ఈ దశలో వ్యాక్సిన్ ఇస్తామని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ నిర్విరామంగా సాగుతుందన్నారు. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ల అవసరం ఎంతో ఉందని, ప్రతివారూ ఈ టీకామందు తీసుకోవాలని ఆయన కోరారు. సమగ్ర వ్యాక్సినేషన్ కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు ఆయన చెప్పారు. అటు తాను వ్యాక్సిన్ తీసుకోబోనని, ఇది బీజేపీ వ్యాక్సిన్ అని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యను నితీష్ కుమార్ ఖండించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయరాదన్నారు. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన విషయం, కాదని, ఈ విషయాన్ని అఖిలేష్ తెలుసుకోవాలని ఆయన సున్నితంగా మందలించారు.
కాగా కరోనా వైరస్ పై తాను చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ వివరణనిస్తూ.. నిపుణులు, శాస్త్రజ్ఞులను, ఫ్రంట్ లైన్ వర్కర్లను అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తన కామెంట్స్ ను మీడియా వక్రీకరించిందన్న ధోరణిలో ఆయన మాట్లాడారు.