రైతుల ఆందోళనలో కొత్త మలుపు, జర్నలిస్ట్ సహా పలువురికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, సాక్షులుగా పిలుపు
రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించి ఓ జర్నలిస్ట్..
రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించి ఓ జర్నలిస్ట్ సహా కొంతమందికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీపై సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాసిన నేపథ్యంలో.. దీన్ని ఈ సంస్థ ఓ కేసుగా పరిగణించింది. అందువల్లే తొలిసారి ఓ జర్నలిస్టుకు కూడా సమన్లు పంపింది. వీరందరికీ నోటీసులు జారీ చేసినట్టు ఎన్ఐఏ కి చెందిన ఓ అధికారి తెలిపారు. కొన్ని వివరాలను నిర్ధారించుకునేందుకు విట్ నెస్ లుగా వీరిని పిలుస్తున్నామని ఆయన అన్నారు. అయితే తన పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థకు, రైతుల ఆందోళనకు గల లింక్ పై వీరినుంచి సమాచారం రాబడతామని, అయితే వీరిని సాక్షులుగా మాత్రమే పరిగణిస్తామని ఆ అధికారి అన్నారు. సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థను ఎన్ ఐ ఏ ..ఖలిస్థాన్ అనుకూల సంస్థగా పరిగణించి లోగడ కేసుకూడా పెట్టింది. పైగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఇందులోని వ్యక్తులకు నిషిధ్ధ ఖలిస్తానీ శక్తులతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
కొత్త చట్టాలపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న రైతు సంఘాల్లో ఒకటైన లోక్ భలాయీ ఇన్సాఫ్ వెల్ ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బల్ దేవ్ సింగ్ కి కూడా దర్యాప్తు సంస్థ నుంచి సమన్లు అందాయి. ఆయనతో బాటు ఇలా సమన్లు అందుకున్నవారంతా రేపు ఢిల్లీలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది.