పారిశ్రామికవేత్తలకు వార్నింగ్.. అలా చేస్తే ఊరుకోమన్న కేటీఆర్
అసలే కరోనా థ్రెట్.. ఆపై లాక్ డౌన్ సమస్యలు వెరసి సామాన్యుడి జీవనం దుర్భరంగా మారుతోంది. ఈ సమయంలో చేతుల్లో డబ్బులు లేకపోగా.. ఉద్యోగం వుంటుందా పోతుందా అన్న టెన్షన్ వేతన జీవిని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికం.. త్వరలో అంతా సర్దుకుంటుందని ప్రభుత్వాలు చెబుతున్నా...
అసలే కరోనా థ్రెట్.. ఆపై లాక్ డౌన్ సమస్యలు వెరసి సామాన్యుడి జీవనం దుర్భరంగా మారుతోంది. ఈ సమయంలో చేతుల్లో డబ్బులు లేకపోగా.. ఉద్యోగం వుంటుందా పోతుందా అన్న టెన్షన్ వేతన జీవిని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికం.. త్వరలో అంతా సర్దుకుంటుందని ప్రభుత్వాలు చెబుతున్నా చాలా చోట్ల పరిశ్రమల్లో ఉద్యోగాల పీకివేత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కే.టీ.రామారావు కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కొన్ని మినహాయింపులు, రాయితీలు, చెల్లింపుల వాయిదా వంటి సౌలభ్యాలు కలిపిస్తున్న నేపథ్యంలో కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను రెగ్యులర్గా చెల్లించాలని, ఎవరి ఉద్యోగమూ తొలగించవద్దని మంత్రి వారికి తెలిపారు. ప్రభుత్వాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎవరి ఉద్యోగాలనైనా తొలగిస్తే.. కార్మిక శాఖ జోక్యం చేసుకుని సదరు కార్మికునికి న్యాయం చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమన్యంపై ఉన్నదని మంత్రి అన్నారు. సోమవారం జిహెచ్ఎంసి కమాండ్ కంట్రోల్ రూం నుండి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి అన్ని జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకటించిన లాక్డౌన్ తో గత నెలరోజుల నుండి దాదాపు అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఒక్క కార్మికుడికి కూడా ఉద్యోగం నుండి తొలగించరాదని స్పష్టం చేశారు. అదే సమయంలో కార్మికులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. పరిశ్రమలకు కూడా విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్ను చెల్లింపులో ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. ఏ పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేయరాదని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిపారు.
శాశ్వత ఉద్యోగులతో పాటు రోజువారి కూలీ పనులతో మనుగడ సాగించేందుకు వివిధ రాష్ట్రాలు, చుట్టుప్రక్కల జిల్లాల నుండి వచ్చిన వలస కార్మికుల సంక్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మానవీయ కోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, 500 రూపాయల నగదును ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో వలస కార్మికులు కూడా భాగస్వాములేనని తెలిపారు. ఫ్యాక్టరీల వద్ద ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రేషన్కార్డులేనివారికి కూడా బియ్యం, నగదును మంజూరుచేసే అధికారులను జిల్లా కలెక్టర్లకు కల్పించినట్లు తెలిపారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. లాక్డౌన్ పొడగింపుతో ఎటువంటి పనులు చేయకుండా ఖాళీగా ఉంటున్న కార్మికులలో తమ ప్రాంతాలకు వెళ్లాలనే భావన కలుగుతుందని తెలిపారు. అయితే వలస కార్మికులు రోడ్లపైకి రావడం వలన ఇంత వరకు అమలు చేసిన లాక్డౌన్ లక్ష్యం దెబ్బతింటుందని తెలిపారు. ఎక్కడ ఉన్న కార్మికులను అదే ప్రదేశంలో ఉంచాలని ఆదేశించారు.
పరిశ్రమలలో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పని ప్రదేశంలో కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాల్సిన బాద్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. అవసరమైనచోట గ్లౌజులు కూడా ఇవ్వాలని తెలిపారు. సదరు పరిశ్రమలు 30-40 శాతం సామర్థ్యం మేరకే నడవాలని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, సామాజిక దూరం నిబంధనల అమలుకు రెగ్యులర్గా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలని ఆదేశించారు.