కమలంతో కలయికపై అసదుద్దీన్ ఒవైసీ స్పష్టత.. ముస్లిం, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని వ్యాఖ్య
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఉండదని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్పై ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఉండదని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్పై ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్, టీడీపీ బలహీనపడటం వల్లే తాజా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. ఎంఐఎం పాతబస్తీపై పట్టును మరోసారి నిరూపించుకుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంఐఎం కార్పొరేటర్లతో అసదుద్దీన్ ఒవైసీ శనివారం సమావేశమయ్యారు. గ్రేటర్ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాలేదని.. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య పలు డివిజన్లలో హోరాహోరీ పోరు నడిచిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బీజేపీ గ్రేటర్ లో సాధించిన విజయాలు ఎక్కువ కాలం ఉండవని చెప్పుకొచ్చారు. సముద్రంలోని రెండు తీరాలు కలవనట్లే.. బీజేపీ, ఎంఐఎం ఎప్పటికీ కలవవని అసదుద్దీన్ ఈ సమావేశం సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. కాగా, ఒక్క 2016లో మాత్రం ఒకే పార్టీ(టీఆర్ఎస్)కి సంపూర్ణ మెజారిటీ (99) కట్టబెట్టిన ఓటరు హంగ్ల చరిత్రకు గ్రేటర్లో మళ్లీ తెరలేపారు. దీంతో తాజా ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన మజ్లిస్ మరోసారి కింగ్ మేకర్గా మారింది.