రాయుడు విజృంభణ, చెన్నై బోణీ
ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్లో చెన్నై దుమ్మురేపింది. ముంబైపై 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది.
ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్లో చెన్నై దుమ్మురేపింది. ముంబైపై 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది. చెన్నై బ్యాట్స్మెన్ రాయుడు విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతడికి డుప్లెసిస్ తో పాటు శామ్ కుర్రాన్ మెరుపులు తోడవడంతో ముంబై విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఈజీగానే ఛేజ్ చేసింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో సౌరభ్ తివారీ (31 బంతుల్లో 42 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్), క్వింటన్ డికాక్ (20 బంతుల్లో 33 పరుగులు, 5 ఫోర్లు)లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆపై ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా అది సాధ్యం కాలేదు. చెన్నౌ బౌలర్లలో లుంగి ఎంగిడికి 3 వికెట్లు దక్కగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలు చెరో 2 వికెట్లు తీశారు. శామ్ కుర్రాన్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై ఆరంభంలో త్వరతరగా వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ అంబటి రాయుడు (48 బంతుల్లో 71 పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (44 బంతుల్లో 58 పరుగులు, 6 ఫోర్లు) లు అర్ధ శతకాలతో రాణించారు. దీంతో చెన్నై టీం 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.