కొత్త పొత్తు పొడుస్తోంది..తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి..మక్కల్ నీది మయ్యంతో మజ్లీస్ ఎత్తులు..!
నిన్న జీహెచ్ఎంసీ.. మొన్న బీహార్... అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కన్ను ఇప్పుడు తమిళనాడుపై పడింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన కమల్హాసన్ పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు.
Majlis Chief Asaduddin : నిన్న జీహెచ్ఎంసీ.. మొన్న బీహార్… అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కన్ను ఇప్పుడు తమిళనాడుపై పడింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన కమల్హాసన్ పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమిళనాడు ఆఫీస్ బేరర్లతో ఒవైసీ సోమవారం భేటీ అయ్యారు. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ హాసన్ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మధురైని తమిళనాడుకు రెండో రాజధానిగా చేస్తామని కమల్హాసన్ ప్రకటించారు. మధురైలో ఆయన రోడ్షో నిర్వహించారు. కాగా 2011 గణాంకాల ప్రకారం తమిళనాడు జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 శాతం ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తోహీద్ జమాత్ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.