లాక్డౌన్ ఉంటుందా ? ఏవైనా మార్పులుంటాయా ?
రేపటితో మోదీ చెప్పిన 21 రోజుల లాక్డౌన్ గడువు ముగుస్తుంది. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకున్న కఠినమైన ఈ నిర్ణయానికి కేసులు తగ్గాల్సి ఉండగా…దురదృష్టవశాత్తు కొత్త కేసులు పెరిగాయి. దీంతో ఇప్పుడు మరోసారి లాక్డౌన్ అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతోంది? ఏమైనా మినహాయింపులుంటాయా? ఇదే ఉత్కంఠ ఇప్పుడు […]
రేపటితో మోదీ చెప్పిన 21 రోజుల లాక్డౌన్ గడువు ముగుస్తుంది. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకున్న కఠినమైన ఈ నిర్ణయానికి కేసులు తగ్గాల్సి ఉండగా…దురదృష్టవశాత్తు కొత్త కేసులు పెరిగాయి. దీంతో ఇప్పుడు మరోసారి లాక్డౌన్ అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతోంది? ఏమైనా మినహాయింపులుంటాయా? ఇదే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది. మరో విడత లాక్డౌన్ విధించాలంటే ఆర్థిక వ్యవస్థనూ దృష్టిలో ఉంచుకుని చేపట్టాలన్నది ప్రధాని ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే సీఎంలతో భేటీ సందర్భంగా ఇటు ప్రాణాలతో పాటు అటు ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే అని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనిబట్టి ఈ సారి లాక్డౌన్లో కొన్ని మార్పులుంటాయనేది సుస్పష్టం అయింది. అయితే, ఆయా వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలపై మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రధాని లాక్డౌన్ నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని ఏ సమయంలోనైనా లాక్డౌన్ నిర్ణయంతో ముందుకు రావొచ్చని తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బే. అందుకే దేశవ్యాప్త లాక్డౌన్ ఈ సారి ఉండకపోవచ్చన్నది అంచనా. ఈ సారి స్మార్ట్ లాక్డౌన్ ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించి.. మిగిలిన జిల్లాల్లో పరిమిత ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధిస్తారని తెలుస్తోంది. వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. లాక్డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసింది.
అలానే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విషయంలోనూ మినహాయింపు ఉండే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో ఇక్కడ శ్రామిక శక్తి అవసరం కాబట్టి ఇక్కడ సామాజిక దూరం పాటించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గుమిగూడడానికి అవకాశం ఉండే పాఠశాలలు, మాల్స్, థియేటర్లకు మాత్రం ఏమాత్రం అనుమతివ్వకపోవచ్చు. లాక్డౌన్ కంటే ముందే వీటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గమనించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా ప్రయాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఒక్కోలా ఉంది. ఒకవేళ ప్రయాణాలకు అనుమతిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్నది గమనించాలి. మొత్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అది ఏ తరహా లాక్డౌన్ అనేది తెలియాలంటే ప్రధాని నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే!