తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు
ఏపీలో అమానుష ఘటన జరిగింది. కృష్ణా జిల్లాలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని తండ్రికొడుకులకు దేహాశుద్ధి చేశారు.
ఏపీలో అమానుష ఘటన జరిగింది. కృష్ణా జిల్లాలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని తండ్రికొడుకులకు దేహాశుద్ధి చేశారు. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు మండలం దేవరగుంటలో మాజీ వైస్ ఎంపీపీ తాళం వెంకటేశ్వరరావు, ఆయన తనయుడిని విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. వెంకటేశ్వరరావు తన బంధువులు, మరికొందరు గ్రామస్థుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ చెల్లించలేదని అప్పు ఇచ్చిన వారు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో అందరికీ సర్దుబాటు చేసేందుకు రూ.20 లక్షలు చెల్లించాలని పెద్దలు తీర్పు ఇచ్చారు.
అయితే, గడువు ముగిసినా బకాయి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు అతడిని నిలదీశారు. అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడిని విద్యుత్తు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ వ్యవహారాన్ని సంబంధించి వీడియో తీసిన గ్రామస్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ‘గ్రామంలో గొడవ జరిగిన మాట వాస్తవమే. బాధితుడైన వెంకటేశ్వరరావు… అది మా వ్యక్తిగత వ్యవహారం.. పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని లేఖ ఇచ్చారని రూరల్ ఎస్ఐ పేర్కొన్నారు.