‘నువ్వా, నేనా సై..’ ఎన్నికల నోటిఫికేషన్ పై రేపే హైకోర్టులో విచారణ, ఈసీ వద్దన్నా.. నెల్లూరులో ‘అమ్మఒడి’ షురూ చేయనున్న సీఎం జగన్
అమ్మఒడికి ఎన్నికల కోడ్ వర్తించదన్న ఏపీ ప్రభుత్వం ఆ పథకం ప్రారంభానికి వడివడిగా అడుగులు వేస్తోంది. రేపు నెల్లూరు జిల్లాలో అమ్మఒడి కార్యక్రమాన్ని..
అమ్మఒడికి ఎన్నికల కోడ్ వర్తించదన్న ఏపీ ప్రభుత్వం ఆ పథకం ప్రారంభానికి వడివడిగా అడుగులు వేస్తోంది. రేపు నెల్లూరు జిల్లాలో అమ్మఒడి కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న హైకోర్టు లో వేసిన పిటిషన్ మీద రేపు విచారణ జరుగనుంది. ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క చెబుతుంటే, ఎన్నికలకు సహకరించలేమని ఉద్యోగ సంఘాలు మరోవైపు తేల్చి చెబుతున్నాయి.
ఇదిలాఉండగా, ఏపీలో ఎన్నికల కోడ్ పై ఇప్పటికే ఈసీ స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 17 వరకు కోడ్ అమల్లో ఉంటుందని తెలిపిన ఈసీ, ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మ ఒడి సహా అన్ని పథకాలను ఆపాలని, ఈ పథకాలన్నింటికి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందని పేర్కొంది. అంతేకాదు, అధికారులు, సిబ్బంది బదిలీలపై నిషేధం కూడా విధించింది. అయితే, ఈసీ నిబంధనలను తోసిరాజని ఏపీ సర్కారు ముందుకెళ్తుండటం విశేషం.