చైల్డ్ పోర్నోగ్రఫి..రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది అరెస్ట్..
కోవిడ్ -19 లాక్ డౌన్ సందర్భంగా ఆన్లైన్లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కేరళ పోలీసులు కొరడా ఝులిపించారు.
కోవిడ్ -19 లాక్ డౌన్ సందర్భంగా ఆన్లైన్లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కేరళ పోలీసులు కొరడా ఝులిపించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రహస్య ఆపరేషన్లో 47 మందిని పోలీసులు పట్టుకున్నారు. పి-హంట్ 20.1 అనే ఆపరేషన్ లో భాగంగా పిల్లల వీడియోలు, ఫోటోలు కలిగిన మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, మొమరీ కార్డ్స్, కంప్యూటర్లు..మొత్తం కలిపి 143 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో అనేక వీడియోలు, చిత్రాలు ఆరు నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల స్థానిక పిల్లలవి కావడం చాలా బాధ కలిగించిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేరళ పోలీసుల సైబర్డోమ్ నోడల్ ఆఫీసర్ మనోజ్ అబ్రహం తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కేరళ పోలీసుల స్పెషల్ టీమ్ నిర్వహించిన డిజిటల్ విశ్లేషణలో పిల్లల లైంగిక వేధింపులపై ఆన్లైన్ మెటీరియల్ పెరుగుదల గమనించినట్లు అబ్రహం చెప్పారు. మరింత లోతైన దర్యాప్తులో ఇందుకు సంబంధించిన అనేక సోషల్ మీడియా గ్రూపులు కనుగొన్నారు పోలీసులు. ఒక్కొక్క గ్రూపులో 200 మందికి పైగా సభ్యులు అలాంటి చిత్రాలను షేర్ చేశారని గుర్తించారు. చాలా అశ్లీల చిత్రాలు, వీడియోలు ఇళ్ళ లోపల చిత్రీకరించినవే ఇటీవలి కాలంలో అప్లోడ్ చేయబడ్డాయని నిర్దారించారు. ఈ లాక్ డౌన్ సమయంలో పిల్లలు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నారో ఈ ఉదంతం తెలియజేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ చేయాలని రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్నాథ్ బెహెరా ఆదేశించారు. ఈ నేపథ్యంలో 110 ప్రదేశాల్లో సోదాలు చేశారు పోలీసులు. 89 కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన వారిలో ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో పనిచేసే యువకులు ఉండటం గమనార్హం. వారిలో ఎక్కువ మంది ఐటి అవగాహన గలవారు కావడంతో కంటెంట్ అప్లోడ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి టెక్నాలజీ ఉపయోగించినట్టు నిర్దారంచారు. కొందరు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు అబ్రహం తెలిపారు.