రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించిన సీఎం పినరయి విజయన్, రాష్ట్రానికి ముప్పుపై ఆందోళన
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ సీఎం పినరయి విజయం గురువారం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం సభ ప్రత్యేకంగా సమావేశమైంది
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం సభ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రస్తుతం రైతుల ఆందోళన ఇలాగే కొనసాగితే కేరళపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయిన పక్షంలో కేరళ ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో సందేహం లేదని వ్యాఖ్యానించారు. వివాదాస్పద చట్టాలను కేంద్రం ఉపసంహరించాలని ఆయన కోరారు.
వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా శాసన సభను సమావేశపరచాలని లోగడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను ప్రభుత్వం కోరగా మొదట ఆయన తిరస్కరించారు.ఈ నెల 23 న సభను సమావేశపరచాలన్న కోర్కెను తిరస్కరిస్తూ..ఇంత అవసరం ఏముందని ఒకసారి, అసలు ఎలాంటి పరిష్కారమూ లభించని సమస్య గురించి చర్చించే పరిధి మీకు లేదని మరోసారి పేర్కొంటూ సీఎం కి లేఖ రాశారు. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు, చేసే సిఫారసులకు గవర్నర్ కట్టుబడి ఉండాలని , సభలో చర్చల నిర్వహణను అడ్డుకునే అధికారాలు ఆయనకు లేవని ముఖ్యమంత్రి విజయన్ తిరిగి ఆయనకు లేఖ రాయడంతో చివరకు గవర్నర్ దిగివచ్చారు.