బెంగాల్ ఎన్నికల్లో పోటీ, నాటి ఘర్షణల్లో గాయపడిన విద్యార్ధి సంఘం నేత పొలిటికల్ ఎంట్రీ ?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్ సై అంటున్నారు. బెంగాల్ లో జమూరియా స్థానానికి ఆమె సీపీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్ సై అంటున్నారు. బెంగాల్ లో జమూరియా స్థానానికి ఆమె సీపీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈమెకు ఈ పార్టీ టికెట్ ఇచ్చింది. సంయుక్త మోర్చా ఈమె అభ్యర్థిత్వానికి మద్దతునిస్తోంది. గత ఏడాది జనవరిలో ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడింది. నాటి ఘటనల్లో రక్తమోడుతున్నఈమె ఫోటోలు, వీడియోలు పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సుమారు 70 మంది ముఖాలకు మాస్క్ లు ధరించి చేతుల్లో ఇనుప రాడ్స్, గ్లాస్ బాటిల్స్ తదితరాలను పట్టుకుని నాడు క్యాంపస్ లో బీభత్సం సృష్టించారు. ఐషేతో బాటు ఆనాడు పలువురు విద్యార్థులు, కొందరు ప్రొఫెసర్లు కూడా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు సంచలనం కలిగించాయి.
జె ఎన్ యూ మాజీ విద్యార్ధి సంఘం నేత అయిన కన్హయ్య కుమార్ కూడా లోగడ 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేసినా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. కాగా బెంగాల్ ఎన్నికల్లో లెఫ్ట్,కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. ఇవి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో చేతులు కలిపాయి. బెంగాల్ మొదటి దశ ఎన్నికలు ఈ నెల 27 న జరగనున్నాయి. మొతం 8 దశల్లో పోలింగ్ జరుగనుంది. మే 2 న ఓట్లను లెక్కిస్తారు. కాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి ఘటనతో ఇప్పుడు పరిస్థితి అంతా ప్రచార స్థాయి బదులు దీనిపై మళ్లింది. ఈ దాడి అబధ్ధమని, ఇదంతా డ్రామా అని బీజేపీ కొట్టిపారేస్తుండగా.. దీనికి కారణం బీజేపీ కార్యకర్తలేనని తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యారోపణ చేస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యార్ధి సంఘం నేత ఐషే ఘోష్ పొలిటికల్ ఎంట్రీ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సిందే !
మరిన్ని చదవండి ఇక్కడ :