#YS Jagan: బెల్టుషాపుల బంద్ అందుకే.. నిజం చెప్పేసిన సీఎం
ఏపీలో బెల్టు షాపులను పూర్తిగా మూసి వేయాలన్న నిర్ణయం వెనుక బలమైన కారణమే వుందంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. బెల్టుషాపులను మూసివేయాలన్న నిర్ణయం వెనుక దూర దృష్టి వుందని చెబుతున్నారు జగన్. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో బెల్టు షాపులను మూసివేయాలని, అక్రమమద్యాన్ని అరికట్టాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.
YS Jagan revealed the reason behind belt shops ban: ఏపీలో బెల్టు షాపులను పూర్తిగా మూసి వేయాలన్న నిర్ణయం వెనుక బలమైన కారణమే వుందంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. బెల్టు షాపుల నడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని మహిళా పోలీసులదేనని సీఎం నిర్దేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, బెల్టుషాపుల రద్దు, మద్యం అక్రమ తయారీలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, ప్రొహిబిషన్–ఎక్సైజ్శాఖ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సమీక్షలో సీఎం వెల్లడించారు. గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసాకేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్లు, ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తామని, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి కొనసాగితే ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీస్తాయని జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను బెల్టు షాపులు నడవవద్దని, బెల్టు షాపులు నడవకుండా చూసుకోవాల్సిన బాద్యత మహిళా పోలీసులదేనని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో మద్యం అక్రమ తయారీ జరగకూడదని, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సీఎం ఆదేశించారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలపై పూర్తి నిఘా పెట్టాలని నిర్దేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలని జగన్ అధికార యంత్రాంగానికి చెప్పారు.
గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదని, గ్రామాల్లో 11 వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారని, వీరిని శక్తివంతంగా వాడుకుని బెల్టుషాపులు నడవకుండా చూడాలన్నారు జగన్. గ్రామాల్లో వున్న మహిళా మిత్రలను కూడా ఈ కార్యక్రమంలో వినియోగించుకోవాలని, ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనులకోసం వినియోగించాలని సీఎం ఆదేశించారు.