విశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫోకస్..ఎయిర్పోర్టు, మెట్రోరైలు, బీచ్ రోడ్డుపై సమీక్ష..వేగవంతం చేయాలని ఆదేశం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో పెరగనున్న యాక్టివిటీస్కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, వేగంగా పనులు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Jagan focus on Visakhapatnam infrastructure: విశాఖపట్నం నగరంలోని మౌలిక వసతులతోపాటు కనెక్టివిటీ, తాగునీటి సౌకర్యాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. భోగాపురం ఎయిర్పోర్టు ముందుగా అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తయ్యేలా చూడాలని, ఎయిర్పోర్టు నుంచి విశాఖకు వేగంగా చేరుకునేలా బీచ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు.
అదే సమయంలో విశాఖలో పెరగనున్న యాక్టివిటీకి అనుగుణంగా తాగునీటి కొరత రాకుండా చూడాలన్నారు. పోలవరం నుంచి పైప్లైన్ ద్వారా తాగునీరు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మూడు పనులకు త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత నివ్వాలని తలపెట్టారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్దేశించారు.
‘‘ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.. ఆ విమానాశ్రయం నుంచి విశాఖ సిటీకి సత్వరమే చేరుకునేలా వేగంగా బీచ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కావాలి.. పోలవరం నుంచి విశాఖకు పైపు లైన్ ద్వారా తాగునీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీఆపీఆర్) వెంటనే సిద్ధం చేయాలి.. ఈ మూడు పనులకు సంక్రాంతిలోపే శంకుస్థాపనకు అధికారులు సన్నద్ధం కావాలి.. ’’ అని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రామాయపట్నం పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు వచ్చే ఫిబ్రవరిలో మొదలుపెడతామన్నారు. మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని వెల్లడించారు.
భావనపాడు పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్నారు. వచ్చే మార్చిలో పనులు మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని అధికారులు వివరించారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి పనులు మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 6 బెర్తులతో 26 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని వివరించారు.
అయితే వచ్చే రెండున్నర ఏళ్లలో ఈ మూడు పోర్టుల పనులన్నీ పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. మరోవైపు విశాపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లోని విశాఖపట్నం నోడ్లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్లో పనుల తీరును అధికారులు సీఎంకు వివరించారు.
రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులను నిర్దేశించారు. తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించ వచ్చని, ఇంకా కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయన్న సీఎం వ్యాఖ్యానించారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్లో కార్యకలాపాలను వివరించిన అధికారులు.. అక్కడ ఎయిర్ కార్గో అవసరం వుందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.