ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన, ఇరాన్ హస్తం ఉన్నట్టు అనుమానం, దర్యాప్తు ముమ్మరం
ఢిల్లీలో శుక్రవారం ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన స్వల్ప పేలుడు ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న లేఖలో..
ఢిల్లీలో శుక్రవారం ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన స్వల్ప పేలుడు ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న లేఖలో ఇది ‘ట్రెయిలర్’ మాత్రమే అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఇరాన్ జనరల్ కాసిం సాలిమనీ, ఆ దేశ టాప్ న్యూక్లియర్ శాస్త్రజ్ఞుడు మొహసెన్ ఫక్రీజాదేలను అమరులుగా ఈ లేఖలో పేర్కొన్నారు. గత యేడాది వీరు దారుణ హత్యకు గురయ్యారు. కాసిం సాలిమనీని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వైమానిక దాడి జరిపి హతమార్చగా.. మొహసెన్ ని ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో శాటిలైట్ కంట్రోల్డ్ మెషిన్ గన్ ని ఉపయోగించి చంపారు. ఈ హత్యలకు ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. కాగా నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు.