బీసీసీఐ మార్గదర్శకాలు.. మూడుసార్లు నెగటివ్ వస్తేనే అనుమతి..
గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే.. ఈ ఎడిషన్ కత్తి మీద సాము అని చెప్పాలి. ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న తరుణంలో బీసీసీఐ..
IPL Standard Operating Procedure: గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే.. ఈ ఎడిషన్ కత్తి మీద సాము అని చెప్పాలి. ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న తరుణంలో బీసీసీఐ.. ఈ ఏడాది ఐపీఎల్ను యూఏఈ వేదిక నిర్వహించేందుకు సిద్దమైంది. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డ్రాఫ్ట్ను తయారు చేసింది. ఆ ఎస్ఓపీల ప్రకారం ఆటగాళ్లు తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాల్సి ఉంటుంది.
1. యూఏఈలోని శిక్షణా శిబిరానికి హరజయ్యే ముందు భారత క్రికెటర్లు, సహాయక సిబ్బందికి వరుసగా ఐదుసార్లు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారు. వాటన్నింటిలోనూ నెగటివ్ రావాలి. ఇక ఇందులో 24 గంటల వ్యవధిలో రెండు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు జరుపుతారు. ఇవన్నీ కూడా యూఏఈ బయల్దేరే వారం ముందు జరుగుతాయి. అటు ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే.. వారు 14 రోజులు పాటు హోం క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత రెండు టెస్టులు నెగటివ్ వస్తేనే పంపిస్తారు.
2.యూఏఈ చేరుకున్న తర్వాత తొలి వారం రోజులలో మూడుసార్లు పరీక్షలు చేస్తారు. అవన్నీ కూడా నెగటివ్ రావాలి. అప్పుడే బయో బబుల్లోకి చేర్చి ప్రాక్టీసుకు అవకాశం ఇస్తారు. ఇక ఈ వారం సమయంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకరితో మరొకరు కలవకూడదు.
3. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఐదు రోజులకు ఒకసారి క్రికెటర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. యూఏఈ నిబంధనల ప్రకారం ఈ లెక్క ఎక్కువ కూడా కావచ్చు. ఇక క్రికెటర్లతో పాటు కుటుంబసభ్యులు రావాలా.? వద్దా.? అనే నిర్ణయం ఆయా ఫ్రాంచైజీలదే. ఒకవేళ వాళ్లు వచ్చినా బయో బబుల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. కాగా, ఎవరైనా ఆటగాడు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి ఆ తర్వాత రెండుసార్లు నెగటివ్ వస్తానే మ్యాచ్కు అనుమతిస్తారు.