ఈ నెక్లెస్ వేసుకుంటే.. కరోనా మీ దరికి రాదు
కరోనాను కట్టడి చేసేందుకు మందును కనుగొనే పనిలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్లో వేగాన్ని పెంచాయి.
కరోనాను కట్టడి చేసేందుకు మందును కనుగొనే పనిలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్లో వేగాన్ని పెంచాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాము తయారు చేసిన నెక్లెస్ వేసుకుంటే చాలు కరోనా మాయమవుతందని ఇండోనేషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెబుతోంది. నీలగిరి ఆకులతో యాంటీ వైరస్ నెక్లెస్ని తయారు చేసిన ఆ దేశ ఆరోగ్య పరిశోధన& అభివృద్ధి సంస్థ బాలిట్బాంగ్తన్.. దాన్ని మెడలో వేసుకుంటే కరోనా వైరస్ దరిచేరదని, ఒకవేళ సోకినా నశిస్తుందని ప్రకటించింది. అంతేకాదు ఈ నెక్లెస్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం.
దీనిపై అక్కడి మంత్రి ఎహ్రుల్ యాసిన్ లింపో మాట్లాడుతూ.. కరోనా వైరస్ని చంపేందుకు నీలగిరి జాతికి చెందిన 700 రకాల మొక్కలతో నెక్లెస్ను తయారు చేశాము. దాన్ని 15 నిమిషాలు ధరిస్తే 42 శాతం వైరస్ నశిస్తుంది. 30 నిమిషాలు వేసుకుంటే 80 శాతం వైరస్ పోతుంది. వీటిని మేము ప్రయత్నించి చూశాము. పలు ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడు ఈ నెక్లెస్ని ధరిస్తున్నా. చాలా బాగా పనిచేస్తుంది. నీలగిరి చెట్లతే యాంటివైరస్ నెక్లెస్ ఒక్కటే కాదు ఇన్హీలర్, శానిటైజర్, క్రీమ్స్, ఆయిల్ సైతం తయారు చేశాం. ఎవరికైనా కత్తి గాట్లు పడినా ఈ క్రీమ్ రాస్తే నయమవుతుంది అని తెలిపారు. ఇక ఈ నెక్లెస్ను ధరించిన వారు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తొలిగిపోయి కోలుకున్నారని అన్నారు. అంతేకాదు నీలగిరి ఆయిల్ని హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ, కరోనా జాతికి చెందిన వైరస్లను నివారించే మందుల్లో వాడొచ్చని వివరించారు. అయితే ఈ నెక్లెస్పై ఇండోనేషియన్ శాస్త్రవేత్తలు పెదవి విరిచారు. దీనికి శాస్త్రీయత లేదని వారు కొట్టిపారేస్తున్నారు. ఇక నెటిజన్లు సైతం వాట్ ఏ జోక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.