పోలవరంపై హైదరాబాద్లో కీలకభేటీ
పోలవరం ప్రాజెక్టు అథారిటీ కీలక భేటీ సోమవారం హైదరాబాద్ నగరంలోని కేంద్ర జలశక్తి కార్యాలయంలో జరిగింది. ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్న ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం.
Important meeting on Polavaram in Hyderabad: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో సవరించిన అంచనాలకు అధికారికంగా క్లియరెన్స్ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబట్టింది. సోమవారం హైదరాబాద్లోని కేంద్ర జలశక్తి కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. దీనికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యం వహించగా.. సుమారు 3 గంటల పాటు భేటీ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ తరపున నీటి పారుదల శాక ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి హాజరు కాగా.. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అటెండయ్యారు. భేటీలో ఎక్కువ సమయం తీసుకున్న ఏపీ అధికారులు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి సవరించిన అంఛనాలకు అధికారికంగా ఆమోద ముద్ర వేయాలని పట్టుబట్టారు. 2017-18లో సాంకేతిక సలహా మండలి ఆమోదించిన 55 వేల 548 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదించాలని ఏపీ అధికారులు కోరగా.. గతంలో ఆమోదం పొందిన సమావేశం వివరాలను కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించింది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఎదురయ్యే ముంపు సమస్యలను ఈఎన్సీ మురళీధర్ రావు ఈ భేటీలో ప్రస్తావించారు. ముంపు బాధితులను ఆదుకోకుండా ముందుకు వెళ్ళ వద్దని కోరారు. సమావేశంలో చర్చించిన అంశాలను, మినిట్స్ను కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు వివరిస్తామని పీపీఏ ఛైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్ ఇరు రాష్ట్రాల అధికారులకు హామీ ఇచ్చారు.
ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర
ALSO READ: ఐపీఎల్ చివరి దశలో కీలకంగా సన్రైజర్స్