బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అనాదిగా వస్తోన్న ఆనవాయితీ, పార్లమెంట్లో హల్వా వేడుకను ప్రారంభించిన నిర్మలా సీతారామన్
పార్లమెంట్ నార్త్ బ్లాక్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సాయంత్రం హల్వా వేడుకను లాంఛనంగా ప్రారంభించారు...
పార్లమెంట్ నార్త్ బ్లాక్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సాయంత్రం హల్వా వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఏడాది పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొని హల్వా స్వీట్ ఆస్వాదించారు. సాధారణంగా అయితే, హల్వా వేడుక పూర్తి కాగానే బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ ప్రతులనుగానీ, ఆర్థిక సర్వే ప్రతులనుగానీ ప్రింట్ చేయడం లేదన్న విషయం తెలిసిందే. కరోనా వేళ ఆయా బడ్జెట్ ప్రతులను డిజిటల్ రూపంలో సభ్యులకు అందజేయనున్నారు. విశేషమేమిటంటే, హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, మంత్రులు, ఇతర సిబ్బంది అంతా ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టేవరకు నార్త్ బ్లాక్లోనే ఉండనున్నారు.