OTT: భారీగా పెరుగుతోన్న ఓటీటీ వ్యాపారం.. ప్రాంతీయ భాషా కార్యక్రమాల వీక్షకులే అధికం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన..
Growth Of OTT Services: లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ చార్జీలు తగ్గడం.. కారణాలు ఏవైనా ఓటీటీ (ఓవర్ ది టాప్).. వినోద రంగం బాగా విస్తరిస్తోంది. అందులోనూ..
Growth Of OTT Services: లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ చార్జీలు తగ్గడం.. కారణాలు ఏవైనా ఓటీటీ (ఓవర్ ది టాప్).. వినోద రంగం బాగా విస్తరిస్తోంది. అందులోనూ బడా సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడం ద్వారా ప్రత్యేకంగా ఓటీటీ సంస్థల మధ్య పోటీ తత్వం పెరిగింది. దీంతో ప్రేక్షకుడికి మంచి కంటెంట్ అరచేతిలో లభిస్తోంది. గడిచిన ఏడాదిలో ఓటీటీ సేవలు ఓ రేంజ్లో ఆదాయాన్ని ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్ తాజాగా తన నివేదికలో వెల్లడించింది. దేశంలో 30కి పైగా ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ల ఆదాయం ఏకంగా రూ.4,500 కోట్లు చేరిందని నివేదికలో తేలింది. ప్రస్తుతం దేశంలో 30కి పైగా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయని ఫిక్కి తెలిపింది. ఈ ఓటీటీ వ్యాపారం విలువ 2017లో రూ.2,019 కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఏకంగా 4,500 కోట్లకు చేరడం విశేషం. ఇక 2022 నాటికి రూ.5,560 కోట్లకు చేరుతుందని ఫిక్కీ అంచనా వేసింది. అంతేకాకుండా 2019తో పోలిస్తే 2020లో ఓటీటీ వీక్షకులు 35 శాతం పెరిగారని, వీరిలో 60శాతం మంది 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారే ఉన్నారని ఫిక్కీ తన నివేదికలో తెలిపింది. ఇక ఓటీటీలలో 40 శాతం ప్రాంతీయ భాషల కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. దేశంలో ఓటీటీ వేదికల ద్వారా ఇంగ్లిష్ కార్యక్రమాల వీక్షకులు కంటే హిందీ, ఇతర ప్రాంతీయ భాషల కార్యక్రమాల వీక్షకులు రెండున్నర రెట్లు అధికంగా ఉండడం విశేషం. ఇక ఇందుకు తగినట్లుగానే ‘ఆహా’ వంటి ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా ప్రాంతీయ భాషలను ప్రధానంగా చేసుకొని కొంత కంటెంట్ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. టాక్ షోలు, వెబ్ సిరీస్లు వంటి సరికొత్త కార్యక్రమాలతో ‘ఆహా’ ప్రస్తుతం ఓటీటీ రంగంలో దూసుకెళుతోంది.