పాట్నా…. ఓ మురికికూపం.. తిలా పాపం తలా పిడికెడు
భారతదేశంలో అత్యంత మురికికూపకమైన నగరం ఏదయ్యా అంటే బీహార్ రాజధాని పాట్నా అని మొన్న స్వచ్ఛ సర్వేక్షన్ సగర్వంగా ప్రకటించింది.. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డు పాట్నాలో నివసిస్తున్న జనానికి ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు..
భారతదేశంలో అత్యంత మురికికూపకమైన నగరం ఏదయ్యా అంటే బీహార్ రాజధాని పాట్నా అని మొన్న స్వచ్ఛ సర్వేక్షన్ సగర్వంగా ప్రకటించింది.. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డు పాట్నాలో నివసిస్తున్న జనానికి ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు.. కారణం వారికి సత్యసత్యాలు తెలుసు కాబట్టి.. ఎన్నికలు దగ్గరున్న సమయంలో ఇలాంటి అవకాశాన్ని విపక్షాలు ఎలా వదిలేస్తాయి..? అందుకే రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన ఒకప్పటి మిత్రుడు, ఇప్పుడు శత్రువు అయిన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఓ ట్వీట్ ట్వీటారు.. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా ఎకసెక్కాలు చేశారు..గత 15 ఏళ్లలో ఎలాగైతేనేం… పాట్నా నంబర్వన్ ప్లేస్లో నిలిచింది.. పాట్నావాసిగా ఇది గర్వంగా ఉందంటూ సున్నితంగా దెప్పిపొడిచారు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిందేనంటూ నితీశ్ను నిలదీశారు.. బీహార్ విషయం వచ్చేసరికి ఇంతదానికి అంతెత్తున కవరేజ్ ఇచ్చే మీడియా కూడా పాట్నా డర్టీయెస్ట్ సిటీగా అవతరించడాన్ని పెద్దగా పట్టించుకోలేదు.. ప్రస్తుతం అక్కడి మీడియా అంతా సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణం చుట్టూ పరిభ్రమిస్తోంది.. పాట్నా నగర అభివృద్ది కోసం వెచ్చించాల్సిన నిధులు ఎటు దారిమళ్లుతున్నాయో తెలియడం లేదు.. రెండేళ్ల కిందట పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు పదేపదే ఆదేశిస్తూ వస్తున్నా బీహార్లోని ఏ రాజకీయవేత్తా చెవికెక్కించుకోలేదు.. తాజా ర్యాకింగ్ బీహార్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెంపపెట్టులాంటిదే! ఈ కఠోర వాస్తవం ఆ మంత్రిత్వ శాఖ డొల్లతనాన్ని బయటపెట్టింది..
పాట్నా నగరం ఇంత దరిద్రంగా ఉంటే ప్రజలు మరి ఇలాంటి నాయకులను ఎలా ఎన్నికుంటున్నారనే ప్రశ్న ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అసంబద్ధమైనది.. ఎందుకంటే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో.. రాజకీయనాయకులు ఎలా ఎన్నుకోబడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే! నేతల పనితీరు ఇప్పుడు కొలమానం కాదు.. సోషల్ ఇంజనీరింగ్లో ఎవరు తోపులో వారే గెలుస్తున్నారు.. భావోద్వేగాలను రెచ్చగొడుతూ నాలుగు ఓట్లను పోగేసుకుంటున్నారు. యాదవ్, ముస్లిం, దళిత్, వెనుకబడిన తరగతులు, రామ్మందిర్, ఆర్టికల్ 370 ఇత్యాది అంశాలే ఎన్నికల స్లోగన్లు అవుతాయి కానీ అభివృద్ధి ఎజెండాగా ఏ పార్టీ కూడా బరిలో దిగదు.. అలా దిగితే ఓట్లు రావన్న సంగతి ఆయా పార్టీలకు తెలుసు.
ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై చర్చే ఉండదు.. ప్రజా సంక్షేమంపై రాజకీయనాయకులకు ఎలాగూ ధ్యాస ఉండదు.. ఆ తపన ఉన్న అధికారులను కూడా స్థిరంగా ఓ చోట ఉండనివ్వరు నేతలు.. మంచిని తలపెట్టినవారిని శంకరగిరి మాన్యాలను పట్టిస్తుంటారు.. అందుకే వారు కూడా మనకెందులే అన్నట్టుగా ఉంటున్నారు. మొన్నటి అకాల వర్షాలు, అనుకోని వరదలప్పుడు అధికార యంత్రాంగం ఎలా పని చేసిందో అందరూ చూశారు. పాట్నా నగరంమంతా చిన్నాభిన్నమయ్యింది.. రోడ్లన్నీ నాశనం అయ్యాయి.. నిరుడు వచ్చిన వరదల నుంచి పాఠాలు నేర్చుకోని యంత్రాంగం ఇప్పుడు చేష్టలుడిగి చోద్యం చూసింది.. ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలలో చేరిపోయాయి.. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే వ్యవస్థ ఎప్పుడో నీరుగారిపోయిందక్కడ! జంతువుల మృత కళేబరాలు నీటి మీద తేలుతూ దర్శనమిచ్చాయి.. అపరిశుభ్రత కారణంగా అంటువ్యాధులు ప్రబలాయి.. కనీసం 55 మంది అనారోగ్యాలతో మరణించారు.
ఇంత జరిగినా నితీశ్ కుమార్ చేసిన తప్పిదాలను అంగీకరించడం లేదు.. పైపెచ్చు ముంబాయి, అమెరికాలో వర్షం నీరు నిల్చిపోలేదా అని వివేకవంతుడైన ఆ ముఖ్యమంత్రి అవివేకంగా ఎదురు ప్రశ్నించారు. పాట్నా అభివృద్ధి కోసం ఏనాడూ ఓ మంచి ప్రణాళికను రూపొందించలేదు.. 1968లో వేసిన భూగర్భ డ్రైనేజ్తోనే నడిపిస్తున్నారు తప్ప వాటిని ఆధునీకరించాలన్న ధ్యాసే పాలకులకు లేదు.. వచ్చే ఎన్నికల్లో పాట్నా అభివృద్ధి పాలకుల ఎజెండా అవుతుందో.. లేక కులమే ప్రధానపాత్ర పోషిస్తుందో చూడాలి..