బాలుతో చక్కటి పాటలు పాడించిన స్వర్ణయుగ సంగీత దర్శకులు

అలనాటి మేటి సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాటలు పాడే అదృష్టం బాలుకు దక్కింది.. వారంతా మామూలు సంగీత దర్శకులు కాదు.. స్వరసాగరాన్ని మధించి అమృతమయమైన పాటలను వెలికి తీయగల మహానుభావులు..

బాలుతో చక్కటి పాటలు పాడించిన స్వర్ణయుగ సంగీత దర్శకులు
Follow us

|

Updated on: Sep 25, 2020 | 4:14 PM

అలనాటి మేటి సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాటలు పాడే అదృష్టం బాలుకు దక్కింది.. వారంతా మామూలు సంగీత దర్శకులు కాదు.. స్వరసాగరాన్ని మధించి అమృతమయమైన పాటలను వెలికి తీయగల మహానుభావులు.. సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల మాస్టారు, అశ్వత్థామ, సుసర్ల దక్షిణామూర్తి, కే.వి.మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, జి.కె.వెంకటేశ్‌ ఇలాంటి లబ్ధప్రతిష్టుల దగ్గర పాటలు పాడారు.. తర్వాత వచ్చిన సత్యం బాలుతో ఎన్నో మధురగీతాలను పాడించారు.. టి.చలపతిరావు, ఆదినారాయణరావులు కూడా బాలును బాగా ప్రోత్సహించారు.. రమేశ్‌నాయుడు, ఇళయరాజా, చక్రవర్తి, రాజన్‌ నాగేంద్ర, కీరవాణి, రాజ్‌-కోటి వంటి సంగీత దర్శకుల దగ్గర కొన్ని వేల పాటలు పాడి ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గొంతులో వైరుధ్యాలు ఉన్నాయని, ఆయనతో మిమిక్రీ చేయించవచ్చని ముందుగా పసికట్టింది టి.వి.రాజు.. కోడలు దిద్దిన కాపురం సినిమాలో అమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడివి అనే పాట ఉంది.. అందులో మాయలఫకీరు ప్రాణము చిలకలోనే ఉన్నది… మా నాన్న ప్రాణము నా పిలకలోనే ఉన్నది అన్న వాక్యాన్ని బాలు అచ్చుగుద్దినట్టుగా పద్మనాభం గొంతులాగే పాడారు. ఇక అప్పట్నుంచి ఏ నటుడికి ఆ నటుడి గొంతును అనుకరించసాగారు బాలు..