వీధి వ్యాపారులకు ఐడీ కార్డులు..
పీఎం స్వనిధి యోజన పథకం లబ్ధిదారులను ఎంపీక చేసేందుకు జీహెఎంసీ ఐడీ కార్డులను జారీ చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను అందించనున్నారు...
జీహెచ్ఎంసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని వీధి వ్యాపారులను గుర్తించే పనిలో పడింది. వీధి వ్యాపారులను గుర్తించడంతోపాటు వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 77,939 మంది స్ట్రీట్ వెండర్స్ లిస్ట్ రెడీ చేయగా… 58,435 మందికి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేసిందని అన్నారు. వీరిలో 9,425 మంది వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి బ్యాంకు రుణాల మంజూరు చేయనున్నారని పేర్కొన్నారు. కరోనా కాలంలో వ్యాపారం నిలిచిపోయి ఇబ్బందులు పడినవారికి ఆర్ధికంగా ఆదుకోవాలని జీహెచ్ ఎంసీ ప్రణాళికలు రెడీ చేస్తోందని డి.ఎస్.లోకేష్ కుమార్ అన్నారు.
చిరు వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం స్వనిధి యోజన పథకాన్ని వీరికి అందించనున్నారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10,000 వరకు రుణాలు అందించ నుంది మోదీ ప్రభుత్వం. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు మొదలుపెట్టేందుకు ఆర్థికంగా సహకారాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.