భాగ్యనగర్ బస్తీల్లో ప్రచార జోరు.. కారుకు ధీటుగా కమలనాథుల రోడ్ షోలు.. రంగంలోకి బీజేపీ అగ్రనేత అమిత్ షా..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో జోరు పెంచాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో జోరు పెంచాయి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలందరికీ ఒక్కో డివిజన్ ప్రచారం బాధ్యతలు అప్పగించారు. అధికార పార్టీ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తుండగా.. గల్లీల్లో మంత్రులు తిష్టవేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సోమవారం జరిగిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్ వాసులపై వరాల జల్లు కురిపించారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు తగ్గట్టుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అటు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను వెనక్కి నెట్టి గ్రేటర్ పోటీలో బీజేపీ రేసులోకి దూసుకుపోతుంది. టీఆర్ఎస్ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. తామేమీ తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం అగ్రనేతలను బరిలోకి దించుతోంది. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని ముఖ్యనేతలందరినీ మోహరించి భాగ్యనగర్ బస్తీల్లో జోరు పెంచుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్లో వాలిపోయారు. టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేందుకు ధీటుగా ఓటర్లను ఆకర్శిస్తోంది.
మరోవైపు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలోని నేతలను రంగంలోకి దింపుతోంది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, జేపీ నడ్డాతో పాటు మరికొందరు ముఖ్య నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు మంగళవారం అగ్ర నేతల పర్యటనను సంబంధిం షెడ్యూల్ విడుదల కానుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్ ఇప్పటికే భాగ్యనగరంలో తిష్టవేశారు. రాష్ట ముఖ్యనేతలతో సమావేశమై దిశానిర్ధేశం చేస్తున్నారు. డివిజన్ వారిగా సమీక్ష నిర్వహిస్తూ ప్రచారతీరుతెన్నులను సమీక్షిస్తున్నారు.
మరోవైపు, మూడేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గ్రేటర్ పోరులో ప్రభావం చూపిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావొచ్చని ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ భాగ్యనగరంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను సైతం రంగంలోకి దింపుతోంది. దుబ్బాక ఉపఎన్నికల్లో సాధించిన గెలుపుతో మంచి ఊపు మీదున్న బీజేపీ.. గ్రేటర్ లో తిరుగులేని కారు జోరుకు ఏ విధంగా బ్రేకులు వేస్తోందో వేచి చూడాలి. కాగా 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ జీహెచ్ఎంసీలో డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది. 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.