హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ, తదితర సంఘాలు న్యాయ విచారణ జరగాలని కోరడంతో.. వీరి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలా ఉండగా మొదట వీరి మృతదేహాలను మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా.. అవి కాస్తా డీ-కంపోజ్ అవుతుండటంతో.. అక్కడ నుంచి డెడ్ బాడీస్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇక గాంధీ ఆసుపత్రిలో ఉన్న మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు వైద్యులు వేలాది రూపాయలను ఖర్చు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేయనున్నారు. ప్రతివారం రూ.7500 విలువైన ప్రత్యేక ఇంజెక్షన్లను మృతదేహాలకు ఇవ్వనున్నారు. వీటి వల్ల డెడ్ బాడీస్ దాదాపు నాలుగు నెలల పాటు డీ-కంపోజ్ కాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే వారానికి ఒకసారి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. కాగా, హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలు ఉండనున్నాయి.