ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో స్ట్రెయిన్ కలకలం..యూకే నుంచి జిల్లాకు 15 మంది..
స్ట్రెయిన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. యూకేలో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్ భయం రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ కనిపిస్తోంది.
స్ట్రెయిన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. యూకేలో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్ భయం రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ కనిపిస్తోంది. గత పది రోజుల వ్యవధిలో యూకే నుంచి 15 మంది జిల్లాకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు.
అందులో అమెరికాతోపాటు ఇతర దేశాల నుంచి మొదలై బ్రిటన్ మీదుగా రాష్ట్రానికి వచ్చి జిల్లాకు చేరిన వారున్నారు. అంతర్జాతీయంగా కొత్త వైరస్ భయం పట్టుకోవడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తయమ్యారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఈ మేరకు బ్రిటన్ నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు ఇవాళ సేకరించారు.
వారిలో ఒకరు హైదరాబాద్లోనే ఉండిపోగా మిగిలిన 14 మంది జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ గురువారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా తేలింది. వారిలో జగిత్యాల విద్యానగర్కు చెందిన మహిళ కాగా, మరొకరు బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన యువకుడుగా అధికారులు గుర్తించారు. వారిద్దరినీ కరీంనగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
వారి కుటుంబసభ్యులను సైతం హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుష్పాల శ్రీధర్ తెలిపారు. వారికి 5 రోజుల అనంతరం పరీక్షలు నిర్వహిస్తామని నెగెటివ్ వచ్చిన మిగతావారు సైతం 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని వైద్యాధికారి శ్రీధర్ స్పష్టం చేశారు.