ఢిల్లీ బోర్డర్ చేరిన వేలాది రైతులు, రామ్ లీలా మైదాన్ వెళ్లేందుకు యత్నం, పోలీసులతో ఘర్షణ
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నదాతలు ఢిల్లీ-హర్యానా లోని సింఘు-టిక్రి బోర్డర్ చేరుకున్నారు. అయితే అనేక చోట్ల పోలీసులు వారిపై వాటర్ క్యానన్లు, బాష్పవాయు ప్రయోగం చేస్తున్నప్పటికీ...
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నదాతలు ఢిల్లీ-హర్యానా లోని సింఘు-టిక్రి బోర్డర్ చేరుకున్నారు. అయితే అనేక చోట్ల పోలీసులు వారిపై వాటర్ క్యానన్లు, బాష్పవాయు ప్రయోగం చేస్తున్నప్పటికీ వేల సంఖ్యలో ఉన్న వారిని అడ్డుకోలేకపోతున్నారు. పోలీసులతో రైతుల ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలీసులతో బాటు కొంతమంది రైతులు కూడా ఘర్షణల్లో గాయపడ్డారు. కాగా… ఢిల్లీ బురారీలోని నిరంకారీ మైదానంలో వీరి ధర్నాకు కేంద్రం అనుమతించినప్పటికీ.. అక్కడ కాదని నిరాకరించిన అన్నదాతలు విశాలమైన రామ్ లీలా గౌండ్స్ కు చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే రైతులు ఈ ఆందోళనలో పాల్గొనగా నిన్న సాయంత్రానికి మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా రైతులు వీరిని కలిశారు. . వీరిలో కొందరు అప్పుడే నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. శ్రామిక్ జనతా సంఘ్, లోక్ మోర్చా సంఘటన్ వంటి సంస్థల సభ్యులు తమ డ్రమ్స్, బ్యాండ్స్ తో రైతులను ఉత్సాహపరుస్తున్నారు.రైతుల ఆందోళన ఫలితంగా ఢిల్లీ లోని పలు కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలను అధికారులు రద్దు చేశారు. దీంతో రోహ్తక్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే తాము పరీక్షలకు ప్రిపేరై ఉన్నామని, ఇప్పుడు పరీక్షలను రద్దు చేసినందున ఏం చేయాలో తోచడంలేదని పలువురు వాపోతున్నారు.