సుప్రీంకోర్టు తీర్పుపై అన్నదాతల అసంతృప్తి, ఆందోళనను కొనసాగిస్తామని హెచ్ఛరిక, చట్టాలను రద్దు చేసేవరకు వెళ్లబోమని ప్రకటన
తమ ఆందోళనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షోభ పరిష్కారానికి మాజీ సీజేఐ ఆధ్వర్యాన ఓ కమిటీని..
Farmers Protest: తమ ఆందోళనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షోభ పరిష్కారానికి మాజీ సీజేఐ ఆధ్వర్యాన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించినప్పటికీ.. తమకు అది సమ్మతం కాలేదని, ఢిల్లీ శివార్లలో నిరసన కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. కేంద్రం వివాదాస్పద చట్టాలను రద్దు చేసేవరకు ఇళ్లకు తిరిగివెళ్ళబోమని ఆయన అన్నారు. తమ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకునేందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఈ సాయంత్రం సమావేశం కానుంది. కోర్టు ఏర్పాటు చేసే కమిటీ ఎదుట తాము హాజరయ్యే ప్రసక్తి లేదని ఈ సంఘం స్పష్టం చేసింది. చట్టాలపై స్టే ఇస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కొంతవరకు తమకు అంగీకార యోగ్యమేనని, కానీ అసలు సమస్య అంతా అసలు పూర్తిగా తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఈ సంఘం పేర్కొంది. ఏమైనా.. మెజారిటీ సంఘాలు మాత్రం అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన రూలింగ్ పట్ల పెదవి విరిచాయి.