గ్రామ వాలంటీర్ల తొలిగింపు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.? వివరణ ఇచ్చిన సచివాలయ శాఖ కమిషనర్.!
ఏపీలో 35 ఏళ్లు పైబడిన గ్రామ వాలంటీర్లను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తపై సచివాలయ శాఖ కమిషనర్ వివరణ ఇచ్చారు...
AP Grama Volunteers: ”గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తూ సచివాలయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు” ఇది మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారం. ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్లలో ఆందోళన చెలరేగింది. ఇక ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. చివరికి తాడేపల్లిలోని సచివాలయ శాఖ కమిషనర్ ఓ ప్రకటన ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. 35 ఏళ్లు పైబడిన వాలంటీర్లను తొలిగిస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. అదంతా కూడా పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
ఆయన ఇచ్చిన ప్రకటనలోని సారాంశం ఇది. ”అందరికీ తెలియచేయునది ఏమనగా 35 సంవత్సరములు నిండిన వాలంటీర్లను తొలగించుచున్నామని ఒక పత్రికలో అనవసమైన అనుమానములకు తావిచ్చుచూ వాలంటీర్లను అనవసరమైన భయాందోళనలకు గురిచేయుచూ వార్తను ప్రచురించుట జరిగినది. వాస్తవముగా అది కేవలము నిబంధనలకు విరుద్ధముగా ఎంపికకాబడిన కేవలము 6 మందిని మాత్రమే తొలగించవలసినదిగా తెలియచేయడమైనది. మిగిలిన వారెవరూ తొలగించబడరు. కావున నిబంధనలకు అనుగుణంగా నియమించబడిన ఏ వాలంటీరు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దు అని తెలియ చేయడమైనది” అని సచివాలయ శాఖ కమిషనర్ తన ప్రకటన స్పష్టం చేశారు.
వాలంటీర్లు ఆందోళన చెందవద్దు 35 సంవత్సరములు నిండిన వాలంటీర్లను తొలగించడం లేదు .#VillageVolunteers pic.twitter.com/SwtzYS9j7k
— Anitha reddy (@Anithareddyatp) December 8, 2020