మాజీ ఎంపీ రాయపాటికి అస్వస్థత…
గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు.
గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రాయపాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు నుంచి ఆయన హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు.
కాగా బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో రాయపాటిని సీబీఐ విచారిస్తోన్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు చేజిక్కించుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ..బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును ఆసరాగా చేసుకుని ఆయనను బెదిరించి.. డబ్బు దోచుకోవాలని చూసిన వ్యవహారంలో చిక్కుముడి వీడుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు.. మలయాళ నటి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్ లను అసలు సూత్రధారులుగా గుర్తించారు. వీరి అరెస్టుకు రంగం సిద్దమైంది.