పితాని వెంకట సురేష్కి హైకోర్టులో చుక్కెదురు
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్కు హైకోర్టులో షాక్ తగిలింది.
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం సురేష్, ఆయన దగ్గర పనిచేసిన మురళీ మోహన్ దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. విచారణలో భాగంగా పితాని, మురళీ తరఫున న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదిస్తూ.. రాజకీయ కక్షతోనే ఈ కేసులో తన పిటిషనర్లను ఇరికించారని వాదించారు. వెంకట సురేష్ ఎప్పుడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే సురేష్ వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీ మోహన్కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని అజయ్ కుమార్ వెల్లడించారు. అందుకే ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన అన్నారు.
అయితే ఈ వాదనతో ఏసీబీ తరపు న్యాయవాది విభేదించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పితాని వెంకట సురేష్కి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. అయితే సురేష్ గత కొన్ని రోజులుగా పరారీలో ఉండగా.. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేయడంతో ఏ క్షణమైనా సురేష్ను అరెస్ట్ చేసేందుకు.. ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహా పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.