Eluru Disease: ఏలూరులో ఆగని అలజడి.. విస్తరిస్తున్న వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితుల సంఖ్య..!
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వింత వ్యాధి దెందులూరుతో పాటు విద్యాసంస్థలకు కూడా కూడా పాకినట్లు తెలుస్తోంది.
Eluru Disease: పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వింత వ్యాధి దెందులూరుతో పాటు విద్యాసంస్థలకు కూడా కూడా పాకినట్లు తెలుస్తోంది. ఈ వింత వ్యాధి కారణంగా సెయింట్స్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయింది. అలాగే దెందులూరులో కూడా పలువురు ఈ వ్యాధి వల్ల అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 540 పైచిలుకు చేరింది. వీరిలో 153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 17 మంది బాధితులను గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక 332 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక బాధితుల్లో 270 మంది పురుషులు, 235 మంది మహిళలు, 71 మంది చిన్నారులు ఉన్నారు.
మరోవైపు బాధితులు అస్వస్థతకు గురి కావడానికి లెడ్ హెవీ మెటల్ కారణమని ఎయిమ్స్ వైద్య బృందం అభిప్రాయపడుతోంది. బ్లడ్ శాంపిల్స్లో లెడ్, నికెల్ మెటల్ ఉన్నట్లు గుర్తించామన్నారు. అటు తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఎన్ఐఎన్ టీమ్ ఏలూరులో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. వింత వ్యాధికి నీరు, ఆహారమే కారణమని.. గాలి ద్వారా విస్తరిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు. ఆహారంలో మెటల్ ఉంటేనే మెదడుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు. రోగుల నుంచి బ్లడ్తో పాటు వింత వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో కూడా శాంపిల్స్ సేకరిస్తున్నామని.. వాటన్నింటిని హైదరాబాద్ ఎన్ఐఎన్లో పరిశోధిస్తామన్నారు. త్వరలోనే ఈ వింత వ్యాధి వ్యాప్తికి గల కారణాలు తెలిసే అవకాశముందని స్పష్టం చేశారు.
కాగా, ఏలూరులో వింత వ్యాధికి కారణాలు అంతుపట్టడం లేదని.. కేంద్రం నుంచి వచ్చిన బృందాలు తుది నివేదిక ఇచ్చాకే ఆ వ్యాధికి అసలు కారణం తెలిసే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో తాగునీటి శాంపిల్స్ను సేకరిస్తున్నామన్న ఆయన.. దీనికి హెవీ మెటల్స్ కారణమని తెలిస్తే తగు రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని సూచించారు.