ఢిల్లీ అల్లర్ల సందర్భంగా అరెస్టయిన వారి విడుదలకు హైకోర్టు ‘నో’, పిల్ విచారణకు తిరస్కృతి
గత నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు, ఆ తరువాత రైతుల నిరసన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన రైతులను, ఇతరులనందరినీ..
గత నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు, ఆ తరువాత రైతుల నిరసన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన రైతులను, ఇతరులనందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ దాఖలైన ‘పిల్’ ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సింఘు, తిక్రి, ఘాజీపూర్ బోర్డర్లలోను, ఢిల్లీ నగరంలోనూ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని రిలీజ్ చేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా ఉందని చీఫ్ జస్టిస్ డీ.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ లతో కూడిన బెంచ్ అభివర్ణించింది. అరెస్టయిన వ్యక్తులమీద పెట్టిన ఎఫ్ ఐ ఆర్ లపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని బెంచ్.. ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
గత నెల 26 న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ముఖ్యంగా ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందుకు కారకులైనవారిపై పెట్టిన ఎఫ్ ఐ ఆర్ లపై తగిన కాలబధ్ధ వ్యవధిలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని కోర్టు పోలీసులకు సూచించింది. నాటి ఘటనలకు సంబంధించి 122 మందిని అరెస్టు చేశామని, 44 కేసులు పెట్టామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే అరెస్టు చేసిన వ్యక్తుల సంఖ్యకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు, ఇతర వర్గాల ద్వారా తెలిసిన సమాచారానికి వ్యత్యాసం ఉందని, అందువల్ల స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ల తరఫు లాయర్ కోర్టును కోరారు.
గల్లంతయిన 15 మంది వ్యక్తుల పేర్లను కూడా ఆ లాయర్ తన పిల్ కు జత చేశారు. ఇక గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనలపై దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 4 కి వాయిదా వేసింది.