రైతు సంఘాలతో మళ్ళీ చర్చలు విఫలం, 5 న తిరిగి అన్నదాతలతో కేంద్రం భేటీ
రైతు సంఘాలతో గురువారం సుమారు 7 గంటలపాటు కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ ఈ నెల 5 న (శనివారం) చర్చలు జరపాలని నిర్ణయించారు. ఏది ఏమైనా సరే వివాదాస్పద చట్టాలను రద్దు చేయాల్సిందే ..
రైతు సంఘాలతో గురువారం సుమారు 7 గంటలపాటు కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ ఈ నెల 5 న (శనివారం) చర్చలు జరపాలని నిర్ణయించారు. ఏది ఏమైనా సరే వివాదాస్పద చట్టాలను రద్దు చేయాల్సిందే అని అన్నదాతలు పట్టు బడుతుండగా కేంద్రం కూడా ఇందుకు ససేమిరా అంటుండడంతో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. కేంద్రానికి ఎలాంటి అరమరికలు లేవని చర్చల అనంతరం వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతులకు మరిన్ని న్యాయపరమైన హక్కులు ఇచ్ఛే విషయాన్ని పరిశీలిస్తామని, కనీస మద్దతుధరపై కూడా హామీ ఇచ్చామని ఆయన చెప్పారు. మొదట రైతులు తమ నిరసన విరమించాలని ఆయన కోరారు. నూతన చట్టాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయని చర్చల సందర్భంగా రైతులు కేంద్రం దృష్టికి తీసుకొ చ్చారు. దీనిపై ప్రభుత్వం తన అభిప్రాయాలను వారికి వివరించింది.
కాంట్రాక్ట్ ఫార్మింగ్ పై ఏ వివాదం తలెత్తినా రైతులు కోర్టులకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఎన్ని చెప్పినా చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు తమ మంకుపట్టు వీడలేదు. మధ్యాహ్నం ఓ విడత చర్చలు ముగిశాక ప్రభుత్వం రైతు సంఘాలకు లంచ్ ఇవ్వజూపినప్పటికీ వారు తిరస్కరించారు. తమ లంచ్ తామే తెచ్చుకున్నామని అంటూ తమ ఫుడ్ తామే తిన్నట్టు తెలిసింది. పంజాబ్ రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే మూసివేశారు.