ఘనంగా మైసూరు దసరా ఉత్సవాలు!
మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మైసూరు రాజవంశస్థులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ సంప్రదాయబద్ధంగా శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగే జంబూ సవారీ కోసం గజరాజుల్ని నిర్వహకులు అందంగా అలంకరించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు మైసూర్ రాజభవనంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. ‘వజ్రముష్టి కలగ’ పురాతన మార్షల్ ఆర్ట్స్ పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బన్నీ మంటప మైదానంలో కాగడాల ప్రదర్శనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. […]
మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మైసూరు రాజవంశస్థులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ సంప్రదాయబద్ధంగా శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగే జంబూ సవారీ కోసం గజరాజుల్ని నిర్వహకులు అందంగా అలంకరించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు మైసూర్ రాజభవనంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. ‘వజ్రముష్టి కలగ’ పురాతన మార్షల్ ఆర్ట్స్ పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బన్నీ మంటప మైదానంలో కాగడాల ప్రదర్శనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంబూ సవారీని కనీసం నాలుగున్నర లక్షల మంది వీక్షిస్తారని అంచనా.
మైసూరులో జరిగే దసరా వేడుకలు చూసి తీరాల్సిందే. గత నాలుగు వందల సంవత్సరాలుగా మైసూరులో దసరా వేడుకలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. మైసూరు ఉత్సవాల సందడి దసరా రావడానికి నెల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా… ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఆటల, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు… ఒక్కటేమిటి… దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు.
మైసూరుకు చెందిన రాజ కుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు ఈరోజుకీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ వుండటం విశేషం. మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరుపుతున్నారని చరిత్ర చెబుతోంది. వడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి.
దసరా ముందు జరిగే వేడుకల సంగతి అలా వుంచితే, దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నులకు విందు చేస్తుంది. గజరాజు మీద స్వర్ణ అంబారీ వుంచి, దానిలో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు. ఒకే చెట్టు కలపతో, 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టి పడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మైసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు.
దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతోపాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధపూజ రోజున అన్ని వృత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ.
దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్ను లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మైసూర్ మహారాజుల నివాసం అయిన ఈ ప్యాలెస్లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే పది రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు.