“కరోనా కూడా జ్వరం లాంటిదే..అధైర్యపడొద్దు”
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం చాలా బాధ కలిగించే అంశమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లనే అనేకమందికి కరోనా వైరస్ సోకిందన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలకు హాజరైన ప్రతి ఒక్కరినీ.. వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని జగన్ చెప్పారు. కరోనాతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనని జగన్ పేర్కొన్నారు. ఈ […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం చాలా బాధ కలిగించే అంశమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లనే అనేకమందికి కరోనా వైరస్ సోకిందన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలకు హాజరైన ప్రతి ఒక్కరినీ.. వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని జగన్ చెప్పారు. కరోనాతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనని జగన్ పేర్కొన్నారు. ఈ వైరస్ సోకకడం పాపంగానో.. తప్పుగానో చూడవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్. రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయని.. ఇందులో 70 కేసుల్లో ఢిల్లీలో మర్కజ్లో పాల్గొన్నవారే ఉన్నారని వివరించారు జగన్. ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 1085 మంది నిజాముద్దీన్కు వెళ్లారని.. అందులో 585 మందికి పరీక్షలు నిర్వహించామని సీఎం చెప్పారు. వీటిల్లో 70 కేసులు పాజిటివ్గా వచ్చాయని.. మరో 500 కేసులు పరీక్షలకు పంపామని పేర్కొన్నారు.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. కరోనా లక్షణాలు ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితిని చెప్పాలన్నారు.. 104కు ఫోన్ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు జగన్.. కరోనా సోకిన వారిని చిన్నచూపు చూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. సంక్షోభ సమయంలో సేవలందించాల్సిందిగా ప్రైవేటు సంస్థలను కోరారు జగన్.. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, వైద్య కళాశాలలు ముందుకు రావాలన్నారు.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు అందరూ సహకరించాలని చెప్పారు జగన్. ఆర్ధిక పరిస్థితిపై భారం పడటంతో వేతనాలు వాయిదా వేసే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సహకారం మరిచిపోలేనిదని కొనియాడారు. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లవచ్చన్నారు. కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.