అర్హులైనా ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ డబ్బులు రాలేదా..అయితే వారికి మరో ఛాన్స్..
ఈ పథకానికి అర్హత కలిగి ఉండి కూడా ఎవరైనా డబ్బులు పొందలేకపోతే ఆవేదన చెందొద్దని సీఎం జగన్ చెప్పారు. ఎవరైనా సరే..తాము అర్హులుగా భావిస్తే వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్లి, పథకం అర్హతలు తెలుసుకోవాలని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. నవరత్నాలతో పాటు తాను పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ మీట నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశారు. గవర్నమెంట్ ప్లానింగ్ ప్రకారం ఈ స్కీమ్ ద్వారా అక్టోబర్లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ప్రజలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఈ పథకం ద్వారా 2,62,493 మంది ఆటో, ట్యాక్సీ కార్మికులు లబ్దిపొందారు. పోయిన సంవత్సరం కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. కొత్తగా ఆటోలు కొన్నవారికి సైతం ఈ స్కీమ్ వర్తింపజేశారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేశారు. పోయిన ఏడాది సెప్టెంబరు 23 నుంచి ఈ సంవత్సరం మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు.
ఈ పథకానికి అర్హత కలిగి ఉండి కూడా ఎవరైనా డబ్బులు పొందలేకపోతే ఆవేదన చెందొద్దని సీఎం జగన్ చెప్పారు. ఎవరైనా సరే..తాము అర్హులుగా భావిస్తే వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్లి, పథకం అర్హతలు తెలుసుకోవాలని చెప్పారు. అర్హులైన వాళ్లు దరఖాస్తు చేసుకుంటే… వచ్చే నెల 4న సహాయం చేస్తామని వివరించారు. లేకపోతే స్పందన వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హతపై విచారణ చేసి వచ్చే నెల 4న నగదు అందిస్తామని అన్నారు.