మహిళా భద్రతా విభాగంపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు...
cm kcr praises CybHer : తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఇంటర్నెట్ వినియోగం వైపు మొగ్గు చూపడంతో సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. ఇలాంటి సమయంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర పోలీస్శాఖ మహిళా భద్రతా విభాగం.
ముఖ్యంగా మహిళలు, ఆన్లైన్ చదువుల్లో నిమగ్నమైపోయిన విద్యార్థులు ఈ నేరాల బారిన పడే ప్రమాదం ఉన్నందున ‘సైబ్-హర్’ పేరుతో చేపట్టిన ఆన్లైన్ అవగాహన కార్యక్రమంపై ముఖ్యమంత్రి స్పందించారు. నెల రోజుల పాటు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 15లక్షల మందికి సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి… దాని బారినపడకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ మార్గాలపైనా, అప్రమత్తతపైనా అవగాహన కల్పించిందని సీఎం లేఖలో పేర్కొన్నారు.
సైబర్ నేరాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వెలువరించిందన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ‘సైబ్-హర్’ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంతో మరో అద్భుతం సాధించిందన్నారు. దీన్ని నిర్వహించిన రాష్ట్ర పోలీస్శాఖ మహిళా భద్రతా విభాగాన్ని మనసారా అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల రాసిన ఈ లేఖను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. మహిళా భద్రతా విభాగం నిబద్ధత, కృషికి ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు.