ఏలూరులో వింత వ్యాధికి ఇవే కారణాలు..తేల్చిచెప్పిన ఎన్ఐఎన్..పరిశోదనల్లో వేగం పెంచాలని సీఎం జగన్ ఆదేశాలు
పురుగు మందుల అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ఎలా వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కొద్ది రోజుల నుంచి నిపుణులు చేసిన అధ్యయనంపై సమీక్ష చేశారు సీఎం జగన్. దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆ బాధ్యతను ఢిల్లీ ఎయిమ్స్, ఎన్ఏసీటీకి అప్పగించారు ముఖ్యమంత్రి.
బాధితులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని, ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్కు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆర్బీకే ద్వారా సేంద్రియ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సూచించారు సీఎం జగన్.
ఎన్ఐఏ విడుదల చేసిన నివేదికలోని వివరాలు…
వాస్తవానికి ఒక్క తాగునీటిలోనే కలుషిత కారకాలు, భారలోహాలు ఉంటాయని ఊహించినప్పటికీ దీనికి భిన్నంగా ఆహార పదార్థాల్లోనూ పురుగు మందుల అవశేషాలు బయటపడటం దిగ్ర్భాంతికి గురిచేశాయి. ఇదే విషయం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (NIN) ప్రస్తావించింది.
తినే అన్నంలో పాదరసం ఛాయలు కనిపిస్తున్నట్లు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం. అసలు ఇది ఎలా సాధ్యమని రకరకాలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా వాసులు సోనామసూరి రకం బియ్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత స్వర్ణ, రేషన్ బియ్యాన్ని వాడతారు. ఇప్పుడు అన్నంలోనే పాదరసం ఛాయలు కనిపించడంతో.. ఇది ఏ రకం బియ్యంలోననే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.