మీ వ్యవహారం హుందాగా లేదు, శివసేన నేత సంజయ్ రౌత్ కు బాంబేహైకోర్టు చురకలు, అటు కంగనాపైనా ..

కంగనా రనౌత్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ ను బాంబే హైకోర్టు తీవ్రంగానే మందలించింది. కంగనాపై లోగడ  చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంపీ పదవికి తగినట్టు లేవని పేర్కొంది.

మీ వ్యవహారం హుందాగా లేదు, శివసేన నేత సంజయ్ రౌత్ కు బాంబేహైకోర్టు చురకలు, అటు కంగనాపైనా  ..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2020 | 7:00 PM

కంగనా రనౌత్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ ను బాంబే హైకోర్టు తీవ్రంగానే మందలించింది. కంగనాపై లోగడ  చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంపీ పదవికి తగినట్టు లేవని పేర్కొంది. ఒక పార్లమెంటేరియన్ గా మీరు నడచుకోలేదని వ్యాఖ్యానించింది. ఇంతేకాదు.. ఈ కేసులో మీరిచ్చిన వివరణ కూడా తమకు అంగీకారయోగ్యంగా లేదని న్యాయమూర్తులు అన్నారు.  కంగనా పట్ల లోగడ సంజయ్ రౌత్ అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.  గతంలో వీరి మధ్య ట్విటర్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. అదే సమయంలో కంగనా రనౌత్ ను కూడా కోర్టు దాదాపు తప్పు పట్టింది. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఆమె  పేర్కొనడంలోని ఔచిత్యాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వంపై తమ అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు వ్యక్తులు నిగ్రహంగా,సంయమనంగా వ్యవహరించాలని వారు సూచించారు.

మహారాష్ట్రను, ముంబైని అవమానపరుస్తూ కంగనా చేసిన కామెంట్స్ సరి కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై కంగనా వేసిన కేసులో కోర్టు నుంచి ఆమెకు ఊరట లభించింది.  తన బంగళాను అధికారులు పాక్షికంగా కూల్చివేయడాన్నిఆమె సవాల్ చేసింది. కూల్చివేతకు గాను ఆమెకి పరిహారం చెల్లించాలని కోర్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని ఆదేశించింది. తనకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని కంగనా తన పిటిషన్ లో కోరింది. కాగా… కంగనా ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేని కూడా అవమానపరుస్తూ ట్వీట్లు చేసిన విషయం గమనార్హం. బహుశా కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించలేదు.